Raghunatha Reddy: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు రఘనాథరెడ్డి కన్నుమూత
ABN, Publish Date - Feb 01 , 2026 | 05:05 PM
టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు రఘనాథ రెడ్డి కన్నుమూశారు.
టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు రఘనాథరెడ్డి (Raghunatha Reddy) కన్నుమూశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన శనివారం రాత్రి కుషాయిగూడ ప్రథమపురి కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
తెలుగులో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించారు. శోభన్ బాబు 'సర్పయాగం' చిత్రంతో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఆయన ఆపై కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా, చీమల దండు, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, సీమ సింహం, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామ రాజ్యం ఇలా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. చివరిగా 2018లో 'సుబ్రహ్మణ్య పురం' సినిమాలో నటించిన రఘునాథరెడ్డి అనారోగ్యం కారణంగా సినిమాలకు గుడ్ బై చెప్పారు.
రఘునాథ రెడ్డిది కృష్ణా జిల్లా కుందేరు గ్రామం. కృష్ణారెడ్డి, సామ్రాజ్యమ్మ దంపతులకు జన్మించారు. ఆపై విజయవాడ, మచిలీపట్నంలలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే లాలగూడ వర్క్షాప్లో పనిచేస్తున్నప్పుడు నాటకాల నుంచి పరుచూరి బ్రదర్స్ సహకారంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.