ఎస్. జానకి పాడిన తొలిపాట ఏంటో తెలుసా.. షాకవుతారు
ABN, Publish Date - Jul 11 , 2026 | 09:12 PM
గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పల్లపట్ల జానకి (S.Janaki) స్వగ్రామం. తండ్రి శ్రీరామూర్తి, ఆయుర్వేద వైద్యులు. తల్లి సత్యవతి. ఇంటిపేరు శిష్ఠావారు. జానకి అక్కచెల్లెళ్ళు ఆరుగురు.
గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పల్లపట్ల జానకి (S.Janaki) స్వగ్రామం. తండ్రి శ్రీరామూర్తి, ఆయుర్వేద వైద్యులు. తల్లి సత్యవతి. ఇంటిపేరు శిష్ఠావారు. జానకి అక్కచెల్లెళ్ళు ఆరుగురు. ఆమె నాలుగోవారు. చిన్నప్పటి నుంచి జానకికి లతా మంగేష్కర్ పాటలంటే ఎంతో ఇష్టం. సంగీత జ్ఞానం ఆమెకు దేవుడిచ్చిన వరం. ఊహతెలిసినప్పటి నుంచి కూనిరాగాలు తీస్తూనే ఉన్నారు. ఆమె బాల్యం కొంత కాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లోనూ, రాజమండ్రిలోనూ గడిచింది. రాజమండ్రిలో ఉన్న రోజుల్లో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర శాస్త్రీయ సంగీత శిక్షణ తీసుకున్నారు. యుక్త వయసులో జానకి ఫన్ డాక్టర్ చంద్రశేఖరంతో ప్రోగ్రామ్స్ చేస్తుండేవారు (ఆ తర్వాత ఆయనే ఆమె మావగారు అయ్యారు. చంద్రశేఖరం కుమారుడు వి. రాంప్రసాద్తోనే జానకి వివాహం జరిగింది).
జానకి గాత్ర శుద్ధిని గుర్తించిన చంద్రశేఖర్ ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందిగా జెమిని, ఏవీయం స్టూడియోస్ కు ఉత్తరాలు రాసేవారు. అలా ఒకసారి ఆడిషన్ కు రండి అని కబురొచ్చింది. అప్పడు ఆమె నెల్లూరులో ఉన్నారు. అక్కడ నుంచి మద్రాసు వెళ్ళి ఏవీయం స్టూడియోస్ లో టెస్ట్ కోసం లతా పాడిన 'రసిక్బలామా' గీతాన్ని పాడారామె. ఆ పాట విన్న వెంటనే ఆమెకు స్టాఫ్ ఆర్టిస్టుగా ఎంపిక చేసి నెల జీతానికి తీసుకున్నారు. ఆ పాట విని సెలక్ట్ చేసుకుంది అప్పటి పర్మనెంట్ స్టాఫ్ అయిన సంగీత దర్శకులు ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్థనం. అయితే చిత్రం ఏమంటే... ఏవీఎం స్టూడియోలో కంటే ముందు ఆమె 1957 ఏప్రిల్ 4న టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో 'విధియిన్ విళ్లైయాట్టు' అనే తమిళ చిత్రంలో తొలిసారిగా 'పేదై ఎన్ ఆసై పాళానదేనో' అనే పాట పాడారు. ఆమెకు చలపతిరావును పరిచయం చేసింది దర్శకుడు వి. రామచంద్రరావు. తమిళ చిత్రంలో ఆమె రెండు పాటలు పాడారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు.
తమిళమే రాని జానకి మొట్టమొదటి సారి తమిళంలో రెండు విషాద గీతాలు పాడటం విశేషం. ఆ తర్వాత ఆమె 1957 మే 5న ఘంటసాలతో కలిసి 'ఎం.ఎల్.ఎ.' సినిమా కోసం 'నా ఆశ అడియాశ చేయిజారే మణిపూస బ్రతుకంతా అమవాస లంబాడోళ్ళ రాందాసా' అనే విషాదగీతం పాడారు. దీని రికార్డింగ్ గోల్డెన్ స్టూడియోస్ లో జరిగింది. అలానే అదే చిత్రంలో ఆమె 'ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం' అనే మరో పాట కూడా పాడారు. అలా విషాద గీతాలతోనే గాయనిగా జానకి కెరీర్ మొదలైంది.