PelliChoopulu: విజయ్ దేవరకొండ విజయ విహారానికి పదేళ్ళు!
ABN, Publish Date - Jul 29 , 2026 | 12:26 PM
విజయ్ దేవరకొండ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం 'పెళ్ళిచూపులు' విడుదలైన పదేళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా అప్పటి ఫోటోలను నిర్మాత రాజ్ కందుకూరి పోస్ట్ చేశారు.
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన సినిమా 'పెళ్ళిచూపులు'. సరిగ్గా పదేళ్ళ క్రితం ఇదే రోజున ఆ సినిమా విడుదలైంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయిన ఆ సినిమాను సురేశ్ బాబు సమర్పణలో యశ్ రంగినేనితో కలిసి రాజ్ కందుకూరి నిర్మించారు. సోలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ కెరీర్కు ఈ సినిమా బలమైన పునాది వేసింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ రావడంతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగారు.
రీతూవర్మ తమిళంలో సైతం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ 'పెళ్ళిచూపులు' చిత్రం తర్వాత టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. అంతేకాదు... ఇప్పుడు నటుడిగానూ రాణిస్తున్నాడు. ఇక ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారంతా ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్రను వేశారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన యశ్ రంగినేని ఆ తర్వాత పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత రాజ్ కందుకూరి 'పెళ్ళిచూపులు' ముందు, ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అయినా ఆయన కెరీర్ లో స్పెషల్ మూవీగా 'పెళ్ళిచూపులు' నిలిచింది.
శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమాకు అప్పట్లో రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా 'పెళ్ళిచూపులు' అవార్డు పొందింది. ఉత్తమ మాటల రచయితగా దర్శకుడు తరుణ్ భాస్కర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. అలానే ఈ సినిమాకు రెండు నంది అవార్డులు వచ్చాయి. 2016కి గానూ ఉత్తమ చిత్రంగా 'పెళ్ళిచూపులు' నిలిచింది, అలానే రీతూవర్మకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. కానీ ఈ అవార్డుల ప్రదానం జరగలేదు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం సెకండ్ బెస్ట్ మూవీగా 'పెళ్ళిచూపులు'ను ఎంపిక చేసి గత యేడాది దానిని అందచేసింది.
ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదలై పది సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం నాటి ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ, నిర్మాత రాజ్ కందుకూరి 'సరిగ్గా 10 సంవత్సరాల క్రితం తరుణ్ భాస్కర్ ఇంట్లో సికంద్రాబాద్ లో సింపుల్ గా ఇలా మొదలు పెట్టిన సినిమా పెళ్ళిచూపులు. నేను క్లాప్ కొడుతుండగా విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ ని తమాషాగా ఆట పట్టించడం మీరు చూడచ్చు. షూట్ ఒక వారం జరిగాక మరో పబ్లిక్ వేడుక చేసాము అనుకోండి. ఈరోజు జూలై 29th కి ఈ సినిమా విడుదల అయ్యి సరిగ్గా 10 సంవత్సరాలు అవుతోంది. ఈ విజయానికి ఒక ముఖ్య కారణం తరుణ్ స్క్రిప్ట్ అయితే దాన్ని ఇంతగా ఆదరించి 100 డేస్ పైగా నడిచి, నేషనల్ అవార్డ్ దాకా తీసుకెళ్లింది మాత్రం ప్రేక్షక దేవుళ్లు మాత్రమే. మరొక్క మారు అందరికీ మనస్పూర్తిగా నమస్సులు' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
చిత్ర పరిశ్రమ నాకు నేర్పింది ఇదే: శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు
నేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు
Naga Chaitanya: ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డా..