Peddi: ఛాంబర్ నిర్ణయానికి ఉషాపిక్చర్స్ తూట్లు!
ABN , Publish Date - May 30 , 2026 | 04:21 PM
'పెద్ది' సినిమాకు కొత్త కష్టాలు కొత్త రూపాల్లో వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకున్న ఉషా పిక్చర్స్ సంస్థకు ఎగ్జిబిటర్స్ కు మధ్య విభేదాలు పొడచూపాయి. ఛాంబర్ నిర్ణయానికి డిస్ట్రిబ్యూటర్ తూట్లు పొడుస్తున్నారని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) 'పెద్ది' (Peddi) సినిమా జూన్ 4న జనం ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని ఓ పక్క నిర్మాతలు పథక రచన చేస్తుంటే... మరో పక్క ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కారణంగా ఎగ్జిబిటర్స్ ఆందోళనకు గురి అవుతున్నారు.
'పెద్ది' సినిమా కృష్ణాజిల్లా పంపిణీ హక్కులను ఉషా పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రదర్శించాలని ఉబలాటపడుతున్న ఎగ్జిబిటర్స్ ఆశలపై ఉషా పిక్చర్స్ సంస్థ నీళ్ళను గుమ్మరిస్తుందని ప్రదర్శనదారులు వాపోతున్నారు. అలవి గాని నిబంధనలను పెట్టడమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సూచనలను సైతం పాటించకుండా ఉషా పిక్చర్స్ సంస్థ ఒంటెద్దు పోకడలు పోతోందని ఎగ్జిబిటర్స్ ఆరోపిస్తున్నారు. 'పెద్ది' సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది. జూన్ 3వ తేదీ రాత్రి 8.00 గంటలకు ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయి. దీని టిక్కెట్ ధరను రూ.600 లు గా నిర్ణయించారు. అలానే జూన్ 4 నుండి పది రోజుల పాటు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 125, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 టిక్కెట్ ధరను పెంచుకునే వెసులు బాటు కల్పించింది.
అయితే పెంచిన టిక్కెట్ ధరలో 7.5 శాతాన్ని ఎగ్జిబిటర్కు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. కానీ ఎగ్జిబిటర్స్ కు ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఉషా పిక్చర్స్ సంస్థ నిరాకరిస్తోందట. అంతే కాకుండా 'పెద్ది' సినిమా ప్రదర్శించాలంటే తమతో రాత పూర్వకమైన ఒప్పందం చేసుకోవాలని, పాత బకాయిలన్నీ చెల్లించాలని, అదనపు షోస్ ప్రదర్శించే హక్కు ఎగ్జిబిటర్స్ కు ఉండదని, ముందస్తుగా తమ నుండి అనుమతి తీసుకోవాలని, ఒకవేళ అలా కాకుండా థియేటర్ లో షో ప్రదర్శిస్తే... దానిని హౌస్ ఫుల్ గా పరిగణించి గ్రాస్ వసూలు చేస్తామని, అలానే ఏ వారానికి ఆ వారం అమౌంట్ సెటిల్ చేయాలని, లేనిపక్షంలో అధిక వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఉషా పిక్చర్స్ సంస్థ నిబంధనలు పెట్టిందట. అంతే కాదు ఏకంగా ఉన్న రెంటల్ ని తగ్గించి మరీ ప్రదర్శించమని ఎగ్జిబిటర్స్ మధ్యే పోటీ పెట్టేసిందట. ఇక ఉషా పిక్చర్స్ విధించిన నిబంధనలకు సంబంధించిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే... ఉషా పిక్చర్స్ సంస్థ గొంతెమ్మ కోరికలు తాము తీర్చలేమని, ఛాంబర్ సూచనలను సైతం పట్టించుకోకపోవడం దారుణమని కృష్ణా జిల్లా ఎగ్జిబిటర్స్ అంటున్నారు. అంతే కాదు వీరంతా ఒక్కటై ఉషా పిక్చర్స్ వారి నిబంధనల పేపర్స్ పై సంతకాలు చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇది మరింత పెద్ద ఇష్యూ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ఎవరూ తగ్గకపోతే ఏకంగా 'పెద్ది' ప్రదర్శనలే రద్దయ్యే ఆస్కారం ఉంది. మరి ఈ ఇష్యూ మరింతగా ముదరక ముందే నిర్మాతలు, ఛాంబర్ పెద్దలు రంగంలోకి దిగి వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్
అరుదైన పిక్.. సూపర్స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!
NBK111: బాలయ్య గ్యాంగ్స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?