‘పళ్లబురుసు’.. ట్రైలర్ విడుదల
ABN, Publish Date - Aug 07 , 2026 | 11:57 AM
బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించిన పళ్లబురుసు ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
బలగం సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) కీలక పాత్రల్లో నటించిన గ్రామీణ నేపథ్య చిత్రం ‘పళ్లబురుసు’ (Pallaburusu). అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios), ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను రూపొందించారు. షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తికాగా.. విడుదలకు చిత్రబృందం సిద్ధమైంది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
ఊర్లో జరిగే ఓ చిన్న వివాదం చివరకు కోర్టు వరకు వెళ్లడం చుట్టూ కథ సాగుతున్నట్లు ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. తండ్రి, కొడుకు మధ్య చోటుచేసుకునే పరిణామాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. పల్లెటూరి మనుషుల జీవన విధానం, వారి మాటతీరు, సహజమైన సంభాషణలను ప్రధానంగా చూపిస్తూ ట్రైలర్ను రూపొందించారు.
ఎలాంటి భారీ హంగులు, అనవసరమైన కమర్షియల్ అంశాలకు చోటివ్వకుండా.. కథ, పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం కనిపిస్తోంది. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవన్ సీహెచ్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్లోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేసింది.
కుటుంబ సంబంధాలు, పల్లె జీవితం, చిన్న చిన్న సంఘటనల చుట్టూ సాగే కథతో రూపొందిన ‘పళ్లబురుసు’పై ట్రైలర్తో ఆసక్తి పెరిగింది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.