ఎన్టీఆర్: అప్పుడు తాత.. ఇప్పుడు నేను..
ABN, Publish Date - Mar 08 , 2026 | 06:34 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రి ప్రత్యేక విభాగం భూమి పూజకు అతిథిగా హాజరయ్యారు. కన్నడిగులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రి ప్రత్యేక విభాగం భూమి పూజకు అతిథిగా హాజరయ్యారు. కన్నడిగులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను ఎన్టీఆర్తోపాటు ఆస్పత్రి యాజమాన్యం గుర్తు చేసుకుంది.
తారక్ మాట్లాడుతూ ‘కర్ణాటకకు వచ్చిన ప్రతిసారీ అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లుగా ఉంటుంది. 1983 మార్చి 20వ తేదిన తాతగారు ఇక్కడ భూమి పూజ చేశారు. మళ్లీ 43 ఏళ్ల తర్వాత అదే మార్చి నెలలో నేను కూడా ఆ కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా, పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా. తాతయ్య ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైంది. అందరూ కూడా వాహనాలను నడిపే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్స్ తో ఎన్టీఆర్ సరదాగా ముచ్చడించారు. ఓ డాక్టర్ '25 ఏళ్ల తర్వాత తారక్ ఏంటి ?' అని ప్రశ్నించగా '67' అంటూ నవ్వుతూ అన్నారు. 'యాక్టర్ కాకుండా డాక్టర్ అయితే ఏ స్పెషలిస్ట్ అయ్యేవారు?' అని అడగ్గా ‘నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల డాక్టర్ని అయ్యేవాడిని’ అని తారక్ సమాధానం ఇచ్చారు.
ఎన్టీఆర్ రాకను తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. కారులోంచి తారక్ అభిమానులకు అభివాదం చేశారు. చెవికి రింగ్తో కొత్త లుక్లో ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు.