మంత్రి లోకేష్ వెంటనే కల్పించుకోవాలి.. ఇరుముడిలో ఆ సీన్లు తొలగింపజేయాలి! ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 09:28 PM
ఇరుముడి సినిమాలో కొన్ని సీన్లు ఉపాధ్యాయులను, ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వెంటనే ఆ సీన్లను తొలగించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి డిమాండ్ చేశారు.
ప్రముఖ హీరో రవితేజ (raviteja) నటించిన ఇరుముడి (Irumudi) సినిమాలో కొన్ని సీన్లు ఉపాధ్యాయులను, ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వెంటనే ఆ సీన్లను తొలగించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి (MLC Borra Gopi Murthy) డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గోపి మూర్తి మాట్లాడుతూ.. సినిమాలు సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలే గానీ సమాజంలో కొన్ని వర్గాలను కించపరిచే విధంగా ఉండకూడదని అన్నారు.
ఇరుముడి సినిమాలో సీలేరు ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలను నేరుగా చూపించడం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న బాలికల డ్రెస్ కోడ్ ను చూపించడాన్ని, ఆ పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలిని ప్రతి నాయకురాలిగా క్రూరంగా చూపించడంపై కూడా తాము అభ్యంతర వ్యక్తం చేస్తున్నామని గోపి మూర్తి అన్నారు.
అంతేగాక.. ఎగస్ట్రా క్లాసులు పేరుతో అమ్మాయిలను ఎమ్మెల్యేకు పంపించడం లాంటి సీన్లను చూపించడంపై కూడా తాము అభ్యంతర వ్యక్తం చేస్తున్న మన్నారు. ఈ సీన్లు కారణంగా సమాజంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా అనే అపోహలు కూడా ప్రజల్లో తలెత్తుతాయని అన్నారు ఎమ్మెల్సీ గోపి మూర్తి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే కల్పించుకుని సినిమాలో ఉన్న అభ్యంతర సీన్లను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.