శ్రీహరి తనయుడు మేఘాంశ్ కొత్త సినిమా!
ABN, Publish Date - Apr 04 , 2026 | 09:09 PM
'రాజ్దూత్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి తనయుడు మేఘాంశ్ ఇప్పుడు 'ఆస్మాన్' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ శిష్యుడు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రియల్ స్టార్, స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. అతను హీరోగా ‘ఆస్మాన్’ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్ని అందించగా, తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ, ‘నా ‘ఆస్మాన్’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తాం’అని అన్నారు. డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ, ‘తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్తో రాబోతున్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది’ అని చెప్పారు.
నిర్మాత శ్రీకాంత్ మన్నెం మాట్లాడుతూ.. ‘మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్గా రాబోతోన్న ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. నా బ్రదర్ వెంకటేష్తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాను. మేఘాంశ్ శ్రీహరితో మా తొలి సినిమాని చేస్తుండటం ఆనందంగా ఉంది. రామ్ నందన్ గారు ‘ఆస్మాన్’ అంటూ అద్భుతమైన కథతో సినిమాని తెరకెక్కించనున్నారు’ అని అన్నారు. మరో నిర్మాత వెంకటేష్ కొండారు మాట్లాడుతూ.. ‘మూడేళ్ల క్రితం మా ప్రొడక్షన్ హౌస్ను స్టార్ట్ చేశాం. అప్పటి నుంచీ కథలు వింటూనే ఉన్నాం. కోడి రామకృష్ణ గారి శిష్యుడైన రామ్ నందన్ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్లో ఓ సినిమా చేశారు. ఇక రామ్ నందన్ గారు చెప్పిన కథకి మేఘాంశ్ గారు సెట్ అవుతారని మేం ఆయన్ను సంప్రదించాం. మేఘాంశ్ గారికి కథ చాలా నచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్గా ఈ చిత్రం రాబోతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ షోయబ్ కాగా, సంగీతాన్ని ప్రశాంత్ ఆర్ విహారి అందిస్తున్నారు.