Muta Mestri: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మాస్ ట్రీట్
ABN, Publish Date - Aug 18 , 2026 | 05:32 PM
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. చిరంజీవి కెరీర్లో మాస్ ఎంటర్టైనర్గా నిలిచిన ‘ముఠామేస్త్రీ’ (muta mestri) ఇప్పుడు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వింటేజ్ సినిమాల రీ రిలీజ్లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 4K వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముఠామేస్త్రీ’ 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కూలీ నాయకుడిగా మెగాస్టార్ చేసిన పాత్ర, ఆయన మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మీనా, రోజా కథానాయికలుగా నటించారు. రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో విశేషంగా ఆదరణ పొందింది. పాటల్లో చిరంజీవి డ్యాన్స్, ఆయన ఎనర్జీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు అప్పటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా 4K వెర్షన్ను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే ఈ సినిమాతో సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారు. ఆగస్టు 21న ‘ముఠామేస్త్రీ’ 4K వెర్షన్ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు.