టాలీవుడ్తో పోల్చితే.. మలయాల చిత్రాల రెవెన్యూ ఎక్కువ..
ABN, Publish Date - Apr 01 , 2026 | 06:04 PM
తెలుగులో సినిమా నిర్మించాలంటే అత్యంత జాగ్రత్త అవసరమన్నారు నిర్మాత బన్నీ వాసు.
తెలుగులో సినిమా నిర్మించాలంటే అత్యంత జాగ్రత్త అవసరమన్నారు నిర్మాత బన్నీ వాసు(Bunny vasu). టొవినో థామస్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘పళ్లిచట్టంబి’ని (Pallichattambi) ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు అని ఆయన తెలిపారు.
పళ్లిచట్టంబి’ గురించి మాట్లాడుతూ.. ‘మనకు తెలిసినవాళ్లు మలయాళంలో సినిమా తీస్తున్నారు అని దర్శకుడు మారుతి ఈ చిత్ర బృందాన్ని పరిచయం చేశారు. సినిమా చూశాక వాళ్లు ఈ చిత్రాన్ని ఎంత్రో ప్రెస్టీజియస్గా నిర్మించారని తెలిసింది. తెలుగు వాళ్లు కేరళ వెళ్లి ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మలయాళం సినిమాలంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అనే భావిస్తాం. కానీ ‘పళ్లిచట్టంబి’ భారీ కమర్షియల్ మూవీ. తెలుగులో పెద్ద హిట్ అవుతుంది. తెలుగులో సినిమా నిర్మించాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మలయాళంలో చిత్ర నిర్మాణంలో ఉన్న కంఫర్ట్ తెలుగులో లేదు. తెలుగులో ఓ సినిమా సక్సెస్ అయితే వచ్చే ఆదాయం కన్నా, మలయాళంలో ఒక మూవీ సక్సెస్ అయితే వచ్చే ఆదాయం ఎక్కువ. మలయాళంలో వచ్చినంత థియేట్రికల్ రెవెన్యూ తెలుగులో రావడం లేదు. టొవినో నటించిన ‘2018’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాం. మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయన పర్ఫార్మెన్స్, ఫైట్స్ ఆకట్టుకుంటాయి. నాకు మోహన్ లాల్ గారిని చూసినట్లు అనిపించింది. ఇందులో కయాదు నటనకు అందరూ ఫిదా అవుతారు. తెలుగులో థియేటర్, డిస్ర్టిబ్యూషన్ వ్యవస్థ బాగుండాలనే ప్రయత్నంలో భాగంగానే వీలైనన్ని ఇతర భాషా చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తున్నాం’ అన్నారు.