అల్లు అర్జున్ మామ.. చంద్రశేఖర్ రెడ్డిపై కేసు
ABN, Publish Date - Sep 15 , 2026 | 04:49 PM
సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
హైదరాబాద్లోని నానక్రామ్గూడ భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) మామ కే. చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrasekhar Reddy)తో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలోని 'మంత్రీ కాస్మోస్' భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి అక్కడ టిన్షీట్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ ఘటనపై మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున పెద్దిరాజు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, మరియు గచ్చిబౌలి ఏసీపీలకు కూడా అసోసియేషన్ బాధ్యులు ఫిర్యాదు ప్రతిని అందించారు. అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది.