అసలు వీడి చావు ఎవరి చేతిలో రాసి పెట్టి ఉందిరా..‘కికు చిరంజీవి’ ట్రైలర్ అదిరింది
ABN, Publish Date - Aug 17 , 2026 | 03:56 PM
కికు యనమల, కాశీష్ ఖాన్ జంటగా నటించిన ‘కికు చిరంజీవి’ ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలోకి రానుంది.
కికు యనమల (Kiku Yanamala), కాశీష్ ఖాన్ (Kashish Khan) జంటగా నటించిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కికు చిరంజీవి’ (Kiku Chiranjeevi). ఈశ్వరరావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నడిమింటి దీప్తి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా మేకర్స్ ‘కికు చిరంజీవి’ ట్రైలర్ను విడుదల చేశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్కు కొనసాగింపుగా ట్రైలర్ కూడా ఆసక్తికరమైన కథాంశంతో ఆకట్టుకునేలా ఉంది.
ట్రైలర్లో హీరో కోసం పలువురు వెతకడం, అతడిపై వరుసగా హత్యాయత్నాలు జరగడం ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా హీరో తిరిగి ప్రాణాలతో బయటపడటం చుట్టూ వచ్చే సన్నివేశాలు, ఎలివేషన్లు అదిరిపోయాయి. సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేదిగా ఉంది. మరోవైపు తన కుమారుడి కోసం తల్లి పడే తపన, ప్రేమించిన యువతితో పెళ్లి, హీరో పాత్రలో కనిపించే విభిన్న కోణాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా గుండె కుడివైపున ఉండే యువకుడి నేపథ్యం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఆగస్టు 28న ‘కికు చిరంజీవి’ థియేటర్లలో సందడి చేయనుంది.