Suresh Babu: సమయానికి, డబ్బుకు విలువ ఇచ్చే సినిమా 'హుషార్ పిట్టలు'
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:40 PM
అన్షు, వాసవీ గణేశన్ జంటగా నటించిన 'హుషార్ పిట్లలు' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఫిలిమ్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతోంది.
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను మేకర్స్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్బాబు విచ్చేసి ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'కొన్ని నెలల ముందు బెక్కెం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసింది. తెలంగాణ నుంచి వచ్చిన దర్శక, నిర్మాతలు ఎంతో పాషన్తో సినిమా తీశారు. మా సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఈ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాను మా సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో ఎదురైన అన్ని కష్టాలు దాటుకుని ఈ స్టేజ్కు వచ్చారు. వాళ్ల ఎగ్రెసివ్తో ఈ సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. తప్పకుండా అందరి టైమ్కు, డబ్బుకు విలువ నిచ్చే సినిమా ఇది అని నమ్ముతున్నారు. విడుదలకు ముందే కొన్ని షోలు వేస్తున్నారు. ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో.. మౌత్ టాక్తో ఈ సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఎంతో నేచురల్గా ఉంటుంది. ఈ సినిమా చూస్తే అందరికి మీ ఊరికి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నా హృదయానికి తాకిన సినిమా ఇది. నేను ఎప్పట్నుంచో కోరుకుంటున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయంతో నాకు సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను' అని అన్నారు. హీరోయిన్ వాసవీ గణేశన్ మాట్లాడుతూ 'మూవీని ఎంతో నమ్మకంతో చేశాం. షూటింగ్ సమయంలో ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ చిత్రీకరణ చేశాం. మన సినిమాకు ఓ పెద్ద బ్యానర్, ఎవరైనా మంచి సపోర్ట్ దొరికితే బాగుండు అనుకునే సమయంలో బెక్కం వేణుగోపాల్ ద్వారా తెలుసుకుని మా సినిమా సురేష్బాబు గారు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. చిన్న సినిమాగా మొదలైన మా ప్రయాణం సురేష్ ప్రొడక్షన్స్తో పెద్ద సినిమాగా మారింది. ఈ మూవీ కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. నన్ను, నా నటనను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చారు. తప్పకుండా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది' అని అన్నారు.
హీరో అన్షు మాట్లాడుతూ 'ఈ క్షణం కోసం 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నన్ను నమ్మి దర్శక, నిర్మాతలు నాకు అవకాశం ఇచ్చారు. హీరోగా అవకాశం రావడం నాకు షాకింగ్గా అనిపించింది. ఈ సినిమా కంటెంట్ పరంగానే కాకుండా టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సినిమా చూస్తుంటే అందరికి తమ సొంతూరికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. అందరూ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తారు. అందరూ మా సినిమాను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మా సినిమాలో ఎమోషన్, ఫన్ అన్ని ఉంటాయి. ఇలాంటి చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనినే నమ్మకం ఉంది' అని అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ 'ఓ మంచి సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి సినిమాలు చేస్తే ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారు అనే విషయం చాలా సార్లు ఫ్రూవ్ అయింది. ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే విశ్వాసం ఉంది' అని అన్నారు. దర్శకుడు బిక్షు మాట్లాడుతూ 'మా సినిమా టీజర్ వైరల్ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ అంతకు మించి అందరికి నచ్చుతుంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఈ సినిమా కథ నేను సమాజంలో చూసిన సంఘటనలతోనే రాసుకున్నాను. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్గా ఉంటుంది. కమర్షియల్ అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చిరంజీన్, డీవోపీ రుద్రసాయి, నటులు గోవర్థన్, భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు: సీఎం విజయ్ తనయుడు
మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే
ఫ్యాన్స్ ప్రెషర్ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..