మహిళా డైరెక్టర్తో మహేష్ సినిమా.. ఆగిపోవడానికి కారణం ఇదేనా
ABN, Publish Date - Aug 30 , 2026 | 06:00 PM
సూపర్స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi) షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా, ఇప్పటికే ప్రధాన భాగం పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడు అనే ప్రశ్న అందరిని కలవరపెడుతోంది. ఆ డైరెక్టర్.. ఈ డైరెక్టర్ అంటూ పేర్లు వినిపిస్తున్నా.. అవేమీ నిజం కాదు అని క్లారిటీ వచ్చింది. ఇక భవిష్యత్ ప్రాజెక్టు గురించి పక్కన పెడితే.. గతంలో మహేష్.. ఒక లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా మిస్ అయ్యిందని ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
జి.వి. ప్రకాష్ ఒక ఇంటర్వ్యూలో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరతో మహేష్ ఒక సినిమా చేయాల్సి ఉండిందని, కానీ అది పట్టాలెక్కలేదని తెలిపాడు. సుధా కొంగర మొదట ఈ కథను తమిళ నటుడు విజయ్కి వినిపించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారని, అయితే ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది సమయం కేటాయించాల్సి రావడంతో విజయ్ దీని నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత 2021 ప్రాంతంలో ఇదే స్క్రిప్ట్తో సుధా కొంగర మహేష్ బాబును సంప్రదించిందని, ఆ సమయంలో ఈ కాంబినేషన్పై మీడియాలో భారీ చర్చ జరిగినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఆ సినిమా ఏంటి.. ? అనేది మిస్టరీగా మారింది.
ఒకవేళ ఈ సినిమా ఓకే అయ్యి ఉంటే, ప్రస్తుత తరం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక మహిళా దర్శకురాలి కాంబినేషన్లో సినిమా చేసిన ఏకైక హీరోగా మహేష్ ఘనత సాధించేవాడు. మహేష్ తండ్రి సూపర్స్టార్ కృష్ణ గతంలో విజయనిర్మల దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ రకంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించే గొప్ప అవకాశం మహేష్ బాబుకు మిస్ అయింది. ఏదేమైనా, భవిష్యత్తులో మహేష్ ఒక మహిళా దర్శకుడితో సినిమా చేస్తే అది టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుంది.