ఇన్నేళ్ల నా జర్నీలో.. కోర్టు మెట్లెక్కడం ఇదే తొలిసారి! నన్ను.. కావాలనే అడ్డుకున్నారు
ABN, Publish Date - Sep 05 , 2026 | 06:29 AM
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానల్ సభ్యులు తమ మేనిఫెస్టోను ప్రకటించారు.
‘ప్రోగ్రెసివ్ ప్యానల్ తరఫున ఏం చేసినా పారదర్శకంగానే ఉంటుంది. సత్యం, నమ్మకం, పారదర్శకత ప్రధానంగా సాగుతాం. నిర్మాతల మండలిని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే మేం రంగంలోకి దిగుతున్నాం’ అని నిర్మాత అశోక్కుమార్ (Ashok Kumar) తెలిపారు. ఆదివారం తెలుగు నిర్మాతల మండలి (Producers Council Elections) ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ప్రోగ్రెసివ్ ప్యానల్ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘నామినేషన్ల ప్రక్రియలో కొందరు నన్ను కావాలనే అడ్డుకున్నారు. ఇన్నేళ్ల నా జర్నీలో నేను కోర్టు మెట్లెక్కడం ఇదే తొలిసారి. ఈ పదవులకు జీతభత్యాలుండవు. ఎంత చేసినా కృతజ్ఞతలేని ఉద్యోగం. అయినా సభ్యులకు సేవ చేయాలనే ధ్యేయంతో మా ప్యానల్ పనిచేస్తోంది. ప్రతి నెలా ఈసీ మీటింగ్ మినిట్స్ని సభ్యులకు తప్పక చేరవేస్తాం. తరతమ భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాం’ అని తెలిపారు.
నిర్మాత దామోదరప్రసాద్ మేనిఫెస్టోని వివరిస్తూ ‘అవసరంలో ఉన్న నిర్మాతలకు వైద్య భద్రత అందిస్తాం. ఏటా రూ.50లక్షల అత్యవసర వైద్య సహాయ నిధిని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వార్షిక సభ్యులుగా ఉన్న 306 మంది నుంచి ఒకేసారి కనీస మొత్తాన్ని వసూలు చేసి జీవిత సభ్యత్వాన్ని కల్పిస్తాం. కొత్త నిర్మాతలను ప్రోత్సహించేలా సింగిల్ విండో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేస్తాం. వర్చువల్ ప్రింట్ పీజు భారానికి ముగింపు పలకడానికి కృషి చేస్తున్నాం. యాక్టివ్ యాంటీ పైరసీ టాస్క్ఫోర్స్ని ఏర్పాటు చేస్తాం. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకురావడానికి మల్టీప్లెక్స్ సంస్కరణలు చేస్తాం’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ ‘గత రెండు మూడు నెలలుగా ఇండస్ట్రీ కళకళలాడుతోంది. మేం నైజామ్లో ఇప్పటిదాకా 180 సినిమాలు విడుదల చేస్తే అందులో 150 చిన్న సినిమాలే. చిన్న నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేస్తే చాలనుకునే రోజులు మారాలి. హిట్ సినిమాలను ప్రతి ఒక్కరూ చూడగలగాలి. స్క్రిప్ట్ పరంగా, టెక్నికల్గా ఎలాంటి సపోర్ట్ అయినా చేయడానికి యాక్టివ్ నిర్మాతలందరం సిద్ధంగా ఉన్నాం. నమ్మకంగా గెలిపిస్తే అందరికీ మంచి చేయడానికి మా వంతు ప్రయత్నిస్తాం’ అని చెప్పారు.
ఐదు లక్షల రూపాయల క్యాష్లెస్ ట్రీట్మెంట్తో పాటు ఎన్నో మంచి సంక్షేమపథకాలతో ప్రోగ్రెసివ్ ప్యానల్ ముందుకొచ్చిందని నిర్మాత ముత్యాల రాందాస్ తెలిపారు. గత కమిటీలు ఈసీ మీటింగులు కూడా సక్రమంగా నిర్వహించలేదని నిర్మాత రవీంద్రగోపాల్ చెప్పారు. కొత్తవారు వచ్చినప్పుడే అభివృద్ధి ఉంటుందని, మార్పు రావాలని నిర్మాత ఆర్.కె. అన్నారు. సభ్యుల సంక్షేమం కోసం ప్రోగ్రెసివ్ ప్యానల్ కష్టపడుతుందని నిర్మాతలు భరత్ చౌదరి, డీఎస్ రావు, బాబ్జీ తదితరులు చెప్పారు.