DSP: గుండెల్లో కళలను నింపిన నాన్న.. నీకు వందనం..
ABN, Publish Date - May 26 , 2026 | 03:36 PM
మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ మనం ఎక్కడి నుంచి వచ్చామో.. ఆ రూట్స్ను ప్రతి క్షణం గుర్తుంచుకునే వ్యక్తి. తను పుట్టి, పెరిగిన గ్రామమన్నా, తన తండ్రి తిరిగిన ప్రాంతమన్నా ఆయనకు ఎంతో గౌరవం, ప్రేమ.
మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ మనం ఎక్కడి నుంచి వచ్చామో.. ఆ రూట్స్ను ప్రతి క్షణం గుర్తుంచుకునే వ్యక్తి. తను పుట్టి, పెరిగిన గ్రామమన్నా, తన తండ్రి తిరిగిన ప్రాంతమన్నా ఆయనకు ఎంతో గౌరవం, ప్రేమ. తండ్రి మరణించి చాలాకాలమైనా.. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలను ఏదో ఒకరూపంలో నెమరు వేసుకుంటుంటారు. సొంతూరి జ్ఞాపకాల గురించి గుర్తు చేసుకుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో దేవిశ్రీ ప్రసాద్ సందడి చేశారు. అక్కడ గ్రామ దేవత పోలేరమ్మ తల్లి జాతర ఉత్సాహంగా జరిగింది. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలతో జాతర వైభవంగా నిర్వహించారు. ఈ జాతర వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.
తన తండ్రి సత్యమూర్తి స్వగ్రామం కావడంతో ప్రతి సంవత్సరం జాతర సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చి పూజల్లో పాల్గొంటుంటారు డీఎస్పీ. ఈ ఏడాది కూడా పోలేరమ్మ తల్లి జాతరకు హాజరైన దేవిశ్రీ ప్రసాద్.. గ్రామస్తులతో కలిసి జాతరను ఎంజాయ్ చేశారు. గరగ నృత్యంలో పాల్గొన్న ఆయన.. కళాకారులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అంతే కాదు తన స్వగ్రామం గురించి చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘వెదురుపాక నా తండ్రి సత్యమూర్తి గారి పుట్టిన గ్రామం. చిన్నతనంలో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నాన్న మమ్మల్ని చెన్నై నుంచి మా సొంతూరుకి తీసుకొచ్చేవారు. ఇక్కడ ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కళలు కూడా అంతే! ఇక్కడే ఓ అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాం. మా ఊరు ఇక్కడ సంస్కృతి అందాలను, జానపద కళల గొప్పతనాన్ని, భక్తి మార్గాన్ని నేర్పించింది. వీటన్నిటి స్ఫూర్తితోనే నేను ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని అంగీకరించాను. నా గుండెల నిండా కళల్ని నింపిన నా తండ్రికి కృతజ్ఞతలు’ అని వీడియో ద్వారా తెలిపారు దేవిశ్రీ ప్రసాద్.
ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా ఎల్లమ్మ సినిమా చేస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకుడు. దిల్ రాజు, శిరీశ్ నిర్మాతలు.