Rajesh Sharma: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో తీవ్ర విషాదం.. విష పురుగు కాటుతో ఐసీయూలో నటుడు
ABN, Publish Date - Jul 08 , 2026 | 10:33 PM
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi Movie) సినిమా షూటింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఓ భారీ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. అయితే బుధవారం ఈ చిత్రం షూటింగ్ సమయంలో అనుకోని విషాదం జరిగింది. షూటింగ్ ముగిసిన అనంతరం ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేశ్ శర్మ (Rajesh Sharma) టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా కుడికాలి పాదంపై విషపురుగు కుట్టడం సబంధఙత పరిసరాల్లో తీవ్ర కలకలం రేపింది.
అయితే.. తొలుత అది ఓ సాధారణ పురుగేనని రాజేశ్ శర్మ నిర్లక్ష్యం చేయడంతో 6 గంటల తర్వాత తీవ్రమైన నొప్పులు, జ్వరం వంటి అరోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే హైదరాబాద్ నుంచి అత్యవసరంగా కోలకత్తాకు పయనమయ్యారు. కానీ ఫ్లైట్లోనే రాజేష్ శర్మ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవడంతో కలకత్తాలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర విభాగం (ICU)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. కుడి కాలు పాదం నుంచి మోకాలి వరకు ఇన్ఫెక్షన్ వేళ్ల నుంచి అత్యంత వేగంగా పాకడంతో ఇప్పటికీ జ్వరం ఇంకా నియంత్రణలోకి రాలేదు. ప్రభావిత ప్రాంతంలో పెద్ద బొబ్బలు కూడా ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో డాక్టర్లు రాజేశ్ శర్మ హెల్త్కు సంబంధించి ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజేశ్శర్మ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఇప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అంచనాలకు రాలేక పోతున్నట్లు తెలిపారు. ఇన్ఫెక్షన్ కారణంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ గడ్డ ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే అవసరమైన అన్ని పరీక్షలు, చికిత్సలు కొనసాగుతున్నాయని గురువారం మరోమారు హెల్త్ అప్డేట్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో రాజేశ్ శర్మ ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తలు ఫేక్ అని అ వార్తలను అసలు నమ్మవద్దంటూ ఆయన అసిస్టెంట్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో సైతం విడుదల చేశారు. రాజేశ్ శర్మ సాధారణ హెల్త్ చెకప్లో భాగంగా తన డయాబెటిస్ టెస్టు కోసం ఆస్పత్రికి వెళ్లాడని డాక్టర్లు పరీక్షలు నిర్వహించి గురువారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని చెప్పినట్లు ఆయన తెలిపాడు. ఈ నేపథ్యంలో ఏ వార్త వాస్తవమో. ఏది అవాస్తవమో తెలియక ప్రభాస్ ఫ్యాన్స్, బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలు అయోమయంలో ఉన్నాయి.