పర్సంటేజ్ సిస్టం.. రావాల్సిందే! నిర్మాతలు-ఎగ్జిబిటర్స్ వార్.. సి. కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - May 14 , 2026 | 06:47 PM
రెండు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలన్న డిమాండ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల (Single screen theatres)లో పర్సంటేజ్ విధానం (percentage system) అమలు చేయాలన్న డిమాండ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిబిటర్స్ (Exhibitors), నిర్మాతల(producers) మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ముదిరి పాకాన పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఎగ్జిబిటర్స్ సమావేశమై ఇకపై పర్సంటేజీ సిస్టంపైనే సినిమాలు రన్ చేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు మీడియా ఎదుటే ప్రకటించారు. అయితే ఆ మరునాడే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఓ మీటింగ్ పెట్టి ఎగ్జిబిటర్లపై సీరియస్ అవడమేగాక వ్యక్తిగతం విమర్శలు చేశారు. పెద్ది సినిమా విడుదల ఉందనే కావాలనే ఇలా పర్సంటేజీ సిస్టం అంటూ రాద్ధాంతం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలో తమపై నిర్మాతలు చేసిన ఆరోపణలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ వివరణ ఇచ్చారు. తమ పోరాటం ఏ ఒక్క సినిమా గానీ, వ్యక్తి గానీ లక్ష్యంగా కాదని.. థియేటర్ల మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేశారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2008 నుంచే పర్సంటేజ్ విధానం అమలు కోసం కృషి చేస్తున్నామని ఎగ్జిబిటర్స్ గుర్తు చేశారు. ఇటీవల దీనిని పెద్ద సినిమాలపై ఒత్తిడిగా చూపించడం బాధాకరమని అన్నారు. కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
ఎగ్జిబిటర్స్ ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణలో 1850 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 475కు పడిపోయిందని తెలిపారు. అలాగే ఒకప్పుడు 175 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, ప్రస్తుతం ఐదుగురు మాత్రమే మిగిలారని చెప్పారు. ఈ గణాంకాలే పరిశ్రమలో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చూపిస్తున్నాయని అన్నారు. అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ, 'మేమంతా థియేటర్ యజమానులమే. మనుగడ కోసం మాట్లాడుతున్నాం. కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. రెంట్ ట్రాక్ వంటి సాఫ్ట్వేర్ ద్వారా వసూళ్ల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని, కావాలంటే నిర్మాతలే ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం టికెట్ ధరలపై నియంత్రణ కోరుతున్నప్పుడు, పారదర్శక ఆదాయ వ్యవస్థపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.
బాల గోవింద్ మాట్లాడుతూ, “పెద్ద సినిమాలను టార్గెట్ చేస్తున్నామన్న ఆరోపణలో నిజం లేదు. మా రెవెన్యూ ఎక్కడికో పోతోంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్స్కు 10 శాతం కంటే తక్కువే మిగులుతోంది” అని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఆరోగ్యకర వాతావరణం తగ్గిపోతోందని, కోవిడ్ తర్వాత పరిస్థితులు మరింత కఠినమయ్యాయని చెప్పారు. ఇప్పుడు హిట్ సినిమాలు కూడా రెండు వారాలకు మించి ఆడడం లేదని పేర్కొన్నారు. సదా నంద్ మాట్లాడుతూ, థియేటర్లు అద్దెకు ఇస్తే ఫుడ్ ధరలపై ఎవరూ మాట్లాడరని, కానీ పర్సంటేజ్ విధానం కోరగానే ఇతర అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. “కూకట్పల్లిలో నా థియేటర్కు లక్ష రూపాయలు అద్దె వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి 25 వేలే వస్తున్నాయి” అని చెప్పారు. చారి మాట్లాడుతూ, “నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారంటే, ఎగ్జిబిటర్స్ ఐసీయూలో ఉన్నట్టే పరిస్థితి. గత మూడు సంవత్సరాలుగా ఇదే సమస్య చెబుతున్నాం. అయినా పరిశ్రమ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని గౌరవిస్తాం” అని అన్నారు.
ఇక.. చివరగా ఈ వివాదంపై నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. “పర్సంటేజ్ విధానం రావాల్సిందే. దాసరి నారాయణరావు గారి కాలంలోనే దానికి ఒక రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కూడా అందరూ కలిసి చర్చించి పరిష్కారం కనుగొనాలి” అన్నారు. సురేష్ బాబు సహా పలువురు ప్రముఖులు రేపటి సమావేశానికి హాజరవుతున్నారని, సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కుటుంబ సమస్య లాంటిదే. కుటుంబ సభ్యులమే కలిసి పరిష్కరించు కోవాలి. ఎవ్వరూ ఎవ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ కరెక్ట్ కాదని పరిశ్రమ బాగుండాలంటే పరస్పర సహకారం అవసరం అని సి. కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏ సినిమా టార్గెట్ కావటం లేదని మనం సినిమా వాళ్లం అందరినీ కలుపుకుని వెళ్లాలి అని ముగించారు.