నీల్ మామ.. పిచ్చెక్కిస్తున్నావ్ పో! ఇంకెంతమందిని దించుతావయ్యా
ABN, Publish Date - Sep 04 , 2026 | 05:58 PM
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సినిమాలో షాహిద్ కపూర్, ఆలియా భట్ నటించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్లోనే కాకుండా.. పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ వస్తున్న డ్రాగన్ (Dragon). తొలిసారి వీరి కాంబోలో సినిమా వస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. అటు 'దేవర' విజయం తర్వాత తారక్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్తోనే ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మాస్ వినాశనం సృష్టించబోతున్నాడో స్పష్టమైంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మరోసారి తన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ దిగ్గజ నటుడు బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో ఇద్దరు బాలీవుడ్ నటులు కనిపించనున్నారనే టాక్ నడుస్తోంది. ఒకరు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) కాగా.. మరొకరు బాలీవుడ్ నటి ఆలియా భట్ (Alia Bhatt). ఒకవేళ ఆలియా భట్ ఈ ప్రాజెక్ట్లో భాగమైతే, ఎన్టీఆర్తో ఇది రెండవ కాంబినేషన్ అవుతుంది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి ఆలియా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' ప్రపంచంలో ఎన్టీఆర్-ఆలియా మళ్లీ కలిసి కనిపిస్తే, అది అభిమానులకు విజువల్ ట్రీట్ కావడం ఖాయం. మరోవైపు, షాహిద్ కపూర్ ఎంట్రీ వార్త కూడా సినిమా రేంజ్ను ఒక్కసారిగా పెంచేసింది. ప్రశాంత్ నీల్ యాక్షన్ వరల్డ్లో షాహిద్ పాత్ర ఎలా ఉండబోతోంది? ఆయన స్క్రీన్ టైమ్ ఎంత? ఎన్టీఆర్తో ఫేస్-ఆఫ్ ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ ఇద్దరూ నిజంగానే ప్రాజెక్ట్లోకి వస్తే, 'డ్రాగన్' పాన్-ఇండియా రేంజ్ మరో లెవెల్కి చేరడం ఖాయం.
ఇక డ్రాగన్ షూటింగ్ సమయంలో తారక్ ఎడమ చేతికి స్వల్ప గాయం కావడంతో చిన్నపాటి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే.. మరో రెండు వారాల్లో పూర్తి ఫిట్నెస్తో తిరిగి 'డ్రాగన్' షూటింగ్ సెట్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనితో మిగిలిన టాకీ పార్ట్, భారీ యాక్షన్ షెడ్యూల్స్ వేగంగా పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలంటే వచ్చే ఏడాది జూన్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.