‘పెద్ది’కి ఉన్న సమయం సరిపోతుందా? మళ్లీ డౌటేనా?
ABN, Publish Date - Feb 07 , 2026 | 01:29 PM
రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ చిత్రం మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 27న విడుదల కావాలి. అయితే డేట్ మారింది. ఏప్రిల్ 30న విడుదల కానున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు.
రామ్ చరణ్(Ram charan), బుచ్చిబాబు సాన (Buchibabu Sana) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ (peddi) చిత్రం మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 27న విడుదల కావాలి. అయితే డేట్ మారింది. ఏప్రిల్ 30న విడుదల కానున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కు ఓ నెల సమయం దొరికినట్టే. అయితే ఈ డేట్ కూడా డౌటే అని ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 45 రోజులు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరు వరకూ ఆపకుండా షూటింగ్ చేస్తే సినిమా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇక ఏప్రిల్ నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవాలి. అదే సమయంలో సినిమా ప్రచారం కూడా మొదలుపెట్టాలి.
పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశమంతటా ప్రచారం చేయాలి. ఇప్పుడున్న తక్కువ సమయంలో ఇదంతా సినిమా యూనిట్కి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సినిమా జనాల్లోకి వెళ్లాలంటే హీరో తప్పకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి. రామ్చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ అయింది. దాంతో దర్శకుడు శంకర్పై నిందలు పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా చరణ్కు ఎంతో కీలకం. తాను ఎంతో ఇష్టపడి బుచ్చిబాబుతో ఈ సినిమా చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఏదన్నా పొరపాటు జరిగితే రామ్చరణ్ని కార్నర్ చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే సినిమాకు ఎంత కష్టపడ్డారో.. ప్రచారం కోసం అంతే కష్టపడాలి. నార్త్లో సినిమాకు ప్రచారం బాగా జరగాలంటే రామ్ చరణ్ మాత్రమే ఆయుధం. ఆయన ఎంతగా ప్రచారం చేస్తే అక్కడ సినిమాకు అంత మైలేజ్ వస్తుంది. దీని అంతటికి ఇప్పుడున్న సమయం సరిపోతుందా? లేదా అన్నది చూడాలి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లతో సినిమాకు మంచి బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే!