మిస్సమ్మ మూడోసారి.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదల
ABN, Publish Date - Aug 20 , 2026 | 07:03 AM
హర్ష నర్రా, తన్మయి ఖుషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ విడుదలైంది.
హర్ష నర్రా (Harsha Narra), తన్మయి ఖుషీ (Tanmayi Khushi), సిజు ఏఆర్, ప్రమోదిని ప్రధాన పాత్రధారులుగా సాయిబాబా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్సమ్మ’ (Modern Missamma) చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ పాటను విడుదల చేశారు. కిట్టూ విస్సా ప్రగడ సాహిత్యం అందించగా గోపీ సుందర్ సంగీతంలో సాహితీ చాగంటి, భవాని కాకేవ్ ఆలపించారు. పెళ్లి దాని నుంచి వచ్చే పర్యవసనాల గురించి కథానాయిక వర్ణిస్తూ ఈ పాట సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలున్న ఈ సినిమా కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’ అని తెలిపారు. హర్ష నర్రా మాట్లాడుతూ ‘ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లు ఉన్న ఈ చిత్రంలోని కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పారు. ‘ఇప్పటివరకూ వచ్చిన ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’, భూమిక ‘మిస్సమ్మ’ లాగే మా ‘మోడ్రన్ మిస్సమ్మ’ కూడా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని సాయిబాబా తెలిపారు.