ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ నియామక ప్రకటన.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో వివాదం!
ABN, Publish Date - May 14 , 2026 | 08:15 PM
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా భరత్ భూషణ్ ను నియమించిన నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్గా భరత్ భూషణ్ (Bharat Bhushan) ను నియమించిన నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కౌన్సిల్ పేరుతో విడుదలైన అధికారిక ప్రకటనపై సంస్థ అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్ వివరణ ఇచ్చారు.
మే 11న మీడియాకు విడుదల చేసిన ఆ ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు భరణ్ భూషణ్ (K L Damodar Prasad)ను ఎపీఎఫ్డీసీ ఛైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కౌన్సిల్ తరఫున అభినందనలు తెలియజేశారు. అయితే ఆ ప్రకటన తనకు తెలియకుండా విడుదలైందని దామోదర ప్రసాద్ తాజాగా ఓ లేఖ ద్వారా వివరించారు.
ఆ ప్రకటనపై తన సంతకం లేదని, విడుదలకు ముందు ఎలాంటి సమాచారం తనకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఇలాంటి అధికారిక ప్రకటనలు సాధారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) వెలువడిన తర్వాత మాత్రమే జారీ చేయాలని, తగిన ప్రక్రియ పాటించకుండా విడుదల చేయడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకటన విడుదలైన రోజున తాను ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలోనే ఉండి పలు సంస్థాగత అంశాలపై సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ, ఈ విషయం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని తెలిపారు. కార్యవర్గ సభ్యులతో చర్చలు జరిగినా ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
అధ్యక్షుడి అనుమతి లేకుండా కౌన్సిల్ పేరుతో ప్రకటన విడుదల కావడం పరిపాలనా లోపమే కాకుండా సంస్థలో అమలులో ఉన్న బాధ్యతాయుత విధానాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ సభ్యులు, చిత్ర పరిశ్రమ వర్గాలు, మీడియాకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఖండన ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు. అయితే ఈ తాజా పరిణామం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నిర్ణయాల ప్రక్రియ, అంతర్గత సమన్వయంపై కొత్త చర్చకు దారితీసినట్టైంది.