నక్క తోక ఫిలిమ్స్.. ఏఐలో పూర్తి సినిమా..
ABN, Publish Date - Aug 29 , 2026 | 04:39 PM
నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ''అంబా'స్ రివెంజ్".
నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై జైవర్ధన్ మేడి (Jaivartham Medi) దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ''అంబా'స్ రివెంజ్" (Ambas revenge). పూర్తిగా ఏఐ (AI)లో తెరకెక్కించిన విజువల్ ఫీస్ట్ మూవీ ఇది. భారత దేశపు ఇతిహాసాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాభారతంలో అంబ ప్రతీకారం నుండి లైన్ తీసుకుని ఈ కథ చేసాము. మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన ఆమె, మరో జన్మలో భీష్ముని పై పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించే దిశగా ఈ చిత్రం ఉంటుంది. మనుషులు ఎవరు నటించకుండా కేవలం ఎఐ ద్వారా రూపొందించిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల ఆవిష్కరించారు.
నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ 'ఎఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. సాధారణంగా ఇటువంటి సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అనుకుంటారు కానీ ఒక టూల్ ఉపయోగించే లోపు మరొక టూల్ వస్తుంది. అలా బాగా ఖర్చు పెరిగింది. ప్రస్తుతం అందరూ రీల్స్ లో ఎఐ చూస్తున్నారు. కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది" అన్నారు.
దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ "సినిమా అంబ అయినప్పటికీ శిఖండి నుండి చూడబోతున్నాము. సినిమాలో ప్రముఖ పాత్రలు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం టీజర్ విడుదల చేశాము. త్వరలో ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాము" అన్నారు. ప్రమోద్ ఎంసి సంగీతం అందించిన ఈ ఎఐ చిత్రానికి హ్యారీ బ్రెయిన్ ఎడిటింగ్ & డిఐ చేయగా కిషోర్ కుమార్ ఏనుగు డైలాగ్స్, లిరిక్స్ అందించారు.