భూ కబ్జా ఆరోపణలు.. స్పందించిన అల్లు అర్జున్ మామ
ABN, Publish Date - Sep 18 , 2026 | 01:05 PM
నానక్రామ్గూడలోని భూ వివాదం నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నానక్రామ్గూడలోని భూ వివాదం నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు అల్లు అర్జున్ (Allu Arjun) మామ చంద్రశేఖర్ రెడ్డి (Chandrasekhar Reddy) స్పందించారు. మంత్రీ కాస్మోస్ ప్రాజెక్ట్కు సంబంధించిన భూమి విషయంలో తమపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని ఆయన స్పష్టం చేశారు. తాము ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని, సంబంధిత భూమిపై చట్టబద్ధమైన హక్కులు తమకు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి, తాను సునీల్ అనే వ్యక్తితో కలిసి నానక్రామ్గూడ ప్రాంతంలోని రైతుల నుంచి భూములను కొనుగోలు చేశామని తెలిపారు. మొత్తం 10 ఎకరాల భూమిలో తాను మూడు ఎకరాలు, సునీల్ మూడు ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆ భూములకు సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.
తాము అక్రమంగా భూమిలోకి ప్రవేశించారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. గేట్లు పగులగొట్టారని, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారన్న ప్రచారం కూడా అవాస్తవమని అన్నారు. ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని, తమ హక్కులను చట్టబద్ధంగా వినియోగించుకున్నామని పేర్కొన్నారు.
భూమి విషయంలో వివాదం తలెత్తిన తర్వాత తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నమోదైన కేసుపైనా చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ, వాస్తవాలు పూర్తిగా బయటకు వస్తే నిజానిజాలు అందరికీ తెలుస్తాయని చెప్పారు. తమ వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలు తమ వాదనకు బలం చేకూరుస్తాయని తెలిపారు.
ఇటీవల ఈ వ్యవహారం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూమిపై తమకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసిన ఆయన, తమపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు.