Allu Arjun: కనిపించే దైవం తండ్రి.. అంటూ భావోద్వేగ పోస్ట్..
ABN, Publish Date - Jun 22 , 2026 | 09:17 AM
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆదివారం ఫాదర్స్ డేను పురస్కరించుకుని తన తండ్రి అల్లు అరవింద్పై ఉన్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు.
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆదివారం ఫాదర్స్ డేను పురస్కరించుకుని తన తండ్రి అల్లు అరవింద్పై ఉన్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. తండ్రితో దిగిన ఫొటో షేర్ చేసి ‘నాకు మా నాన్నే దేవుడు. నేను కంటితో చూడగలిగే, చెవులతో వినగలిగే, నోటితో మాట్లాడగలిగే, చేతితో తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండటానికి నాకు అన్నీ ఇచ్చారు. నా ప్రియమైన నాన్నకి, ప్రపంచంలోని ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అని పోస్టులో పేర్కొన్నారు. ఈ అపురూప వీడియోకు తండ్రి విశిష్టత గురించి చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ప్రవచనాన్ని జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.... అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతో అభిమానులకు ఐ ఫీస్ట్ కలిగించాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అలానే... 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే! సోమవారం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11 నిందితుడిగా చేర్చారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి కొన్ని నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల డిశ్చార్జీ అయి ఇంటికి చేరారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులకు అల్లు కుటుంబం పెద్ద మొత్తంలో సాయం అందించిన విషయం తెలిసిందే!