Ajay Bhupathi: అభినందిస్తాడని ఇంటికి వెళ్తే.. మహేష్ చేసిన పనికి షాకయ్యా
ABN, Publish Date - Jul 21 , 2026 | 07:21 PM
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్లో విపరీతమైన సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఈ సినిమా రిలీజ్ తరువాత అజయ్ స్టార్ డైరెక్టర్ అవుతాడు అనుకున్నారు.
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్లో విపరీతమైన సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఈ సినిమా రిలీజ్ తరువాత అజయ్ స్టార్ డైరెక్టర్ అవుతాడు అనుకున్నారు. కానీ, ఆ తరువాత అజయ్ మహా సముద్రం సినిమాతో వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక మళ్లీ కొంత గ్యాప్ తీసుకొని మంగళవారం తో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణని శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా జులై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అజయ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అజయ్ భూపతి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకు జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను బయటపెట్టారు. ఆర్ఎక్స్ 100 ఘన విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు స్వయంగా తనను పిలిపించారని, కేవలం సినిమాను, తన పనితనాన్ని అభినందించడానికే పిలిచారనుకుని వెళ్తే.. అక్కడ మహేష్ బాబు తదుపరి సినిమా కోసం కథ చెప్పమని అడగడంతో తాను తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు.
మహేష్ అలా అడుగుతాడని నేను అనుకోలేదు. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి చారిత్రక అంశాలు, హంపి నగరం చుట్టూ ఉన్న అనేక రహస్యాలు, మిస్టరీల నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ లైన్ను వినిపించాను. ఆ కథ విన్న మహేష్ బాబు ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడు. అయితే అంత పెద్ద హిస్టారికల్ అండ్ మిస్టరీ సబ్జెక్ట్ను డ్రీమ్ ప్రాజెక్ట్ గా దాచి పెట్టుకోమని చెప్పాడు. ఇప్పుడే ఇలాంటి సినిమాలు కాకుండా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కథతో తన వద్దకు రమ్మని చెప్పాడు. అందుకే ఆ ప్రాజెక్టు ని నా డ్రీమ్ ప్రాజెక్టు గా పెట్టుకున్నాను' అని అజయ్ చెప్పుకొచ్చాడు. మరి అజయ్ భూపతి భవిష్యత్ లో ఒక కమర్షియల్ కథతో మహేష్ ని మెప్పిస్తాడేమో చూడాలి.