బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా.. నాలో మార్పు రాలేదు: ఐశ్వర్య రాజేష్
ABN, Publish Date - Jul 16 , 2026 | 09:09 PM
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తోన్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
తిరువీర్ (Thiru Veer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటిస్తోన్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’ (Oh..! Sukumari). నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు, సినిమాపై మంచి అంచనాలను ఏర్పడేలా చేసింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ మూవీ విశేషాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
‘‘ముందుగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. దర్శకుడు భరత్ దర్శన్ కథ చెప్పారు. తర్వాత నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నేను చేసిన దామిని పాత్రకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ముట్టుకుంటే షాక్ కొడతాను. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది దామిని కథ. నా పాత్రను ప్రేక్షకులు ఎంతో ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. నేను ఇప్పటివరకు ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేశాను. ఒక దర్శకుడు కథ చెప్పే విధానం, ఆయనపై కలిగే నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నాకు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండటంతో ప్రతి విభాగంపై కొంత అవగాహన వచ్చింది. మనకు తెలిసిన విషయాన్ని చెప్పడంలో గానీ, వినడంలో గానీ ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తాను.
నా కెరీర్లో విజయాన్ని, పరాజయాన్ని ఒకేలా చూస్తాను. నేను తమిళ్లో వరుసగా ఐదు హిట్లు ఇచ్చాను. ఆ సంవత్సరం మా ఇంటికి చాలా బొకేలు వచ్చాయి. ఆ తర్వాత ఏడాది రెండు హిట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు ఇంటికి వచ్చే బొకేల సంఖ్య కూడా తగ్గింది. బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా నాలో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే ఈ జర్నీలో నేను నేర్చుకున్నాను. సినిమాలనే కాదు.. ఏ ప్లాట్ఫామ్నీ వదలకూడదని అనుకుంటాను. వెబ్ సిరీస్లకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి రీచ్ ఉంటుంది. నేను చేసిన ‘సుడల్’ వెబ్ సిరీస్కు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ లభించింది. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా దాని గురించి చాలామంది మాట్లాడేవారు. అది దాదాపు 34 భాషల్లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ కోసం ఒక ప్రాజెక్ట్, హాట్స్టార్ కోసం మరో వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదు. నీలాంబరి తరహా పాత్రలు చేయాలనే కోరిక ఉంది. అలాగే ‘అబ్సెషన్’ లాంటి పాత్రల్లో కూడా నటించాలని ఉంది. ‘ఓ.! సుకుమారి’ క్యూట్ విలేజ్ స్టోరీ. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్కుమార్ షాకింగ్ పోస్ట్..
నితిన్ ‘హ్యాట్రిక్’ సినిమాలు.. ఈసారైనా హిట్ దక్కేనా
‘వారణాసి’.. జక్కన్నకు కొత్త టెన్షన్!