‘శంబాల’ కాంబో రిపీట్.. ఆది హీరోగా సరికొత్త థ్రిల్లర్
ABN, Publish Date - May 12 , 2026 | 07:33 PM
‘శంబాల’తో సంచలన విజయం అందుకున్న హీరో ఆది సాయికుమార్, నిర్మాతలు మహిధర్ రెడ్డి–రాజశేఖర్ అన్నభిమోజు, సమర్పకుడు యుగంధర్ ముని మరోసారి చేతులు కలిపారు.
‘శంబాల’(Shambala) తో సంచలన విజయం అందుకున్న హీరో ఆది సాయికుమార్ (Adi Saikumar), నిర్మాతలు మహిధర్ రెడ్డి–రాజశేఖర్ అన్నభిమోజు, సమర్పకుడు యుగంధర్ ముని (Yugandhar Muni) మరోసారి చేతులు కలిపారు. ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించిన ఆ బ్లాక్బస్టర్ కాంబినేషన్.. ఇప్పుడు ఇంకో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈసారి దర్శకురాలు బృందా రవీందర్ ఈ ప్రాజెక్ట్కు (brinda-ravinder) దర్శకత్వం వహించనుండటం ఆసక్తిని మరింత పెంచుతోంది.
యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందనున్న ఈ చిత్రం ఎమోషన్స్, హారర్, థ్రిల్ కలబోసిన వినూత్న కథాంశంతో తెరకెక్కనుంది. ‘శంబాల’ తర్వాత అదే స్థాయిలో గుర్తుండిపోయే సినిమా చేయాలన్న లక్ష్యంతో టీమ్ ఎంతో జాగ్రత్తగా ఈ కథను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. భయం, ఉత్కంఠ, వినోదం, భావోద్వేగాలు అన్నీ సమపాళ్లలో ఉండేలా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. పోస్టర్లో ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్, రక్తంతో కనిపించే రూపం, చుట్టూ విరబూసిన పూలు, ఆకులు, పాతకాలపు స్టాంప్ వంటి ఎలిమెంట్స్ సినిమా బ్యాక్డ్రాప్పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పోస్టర్ చూస్తుంటే మిస్టరీతో నిండిన మరో డిఫరెంట్ సినీ ప్రయాణం ప్రేక్షకులను ఎదురుచూస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సంగీతం కీలక బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. అందుకే ‘శంబాల’కు తన సౌండ్ డిజైన్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ చరణ్ పాకాలని మరోసారి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేశారు. నేపథ్య సంగీతంతోనే టెన్షన్ పెంచుతూ, నిశ్శబ్ద క్షణాల్లో కూడా భయాన్ని పుట్టించేలా కొత్త తరహా సౌండ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
మొత్తానికి ‘శంబాల’ కాంబో మళ్లీ కలవడం, అదీ మరింత డిఫరెంట్ కాన్సెప్ట్తో రావడం సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన నటీనటులు, టైటిల్, విడుదల తేదీ వంటి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.