Sakshi Vaidya: మనసుకు నచ్చిన.. పాత్ర చేశా
ABN, Publish Date - Jan 08 , 2026 | 07:55 AM
శర్వానంద్ కథానాయకుడిగా సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ .
శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర (Anil Sunkara), రామబ్రహ్మం సుంకర నిర్మించారు. జనవరి 14న విడుదలవుతున్న సందర్భంగా కథానాయిక సాక్షి వైద్య (Sakshi Vaidya) మీడియాతో ముచ్చటించారు.
‘ఇందులో నిత్య అనే పాత్ర చేశాను. కథ వినగానే చాలా నచ్చింది. ‘స్టోరీ ఈజ్ కింగ్’ అనిపించి వెంటనే అంగీకరించాను. నిత్య పాత్ర చాలా అమాయకంగా, నిజాయితీగా ఉంటుంది. ఆ పాత్ర స్వభావం నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా అనిపించింది. అందుకే పర్సనల్గా రిలేట్ అయ్యి నటించాను. ఈ పాత్ర కోసం దాదాపు నెల రోజుల పాటు వర్క్ షాప్ చేశాం. పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నాకే సెట్స్పైకి వెళ్లాం.
శర్వానంద్తో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. వెన్నెల కిశోర్, నరేశ్ గారి పాత్రలు చాలా బావుంటాయి. తెలుగు భాష మాట్లాడడం కష్టమే అయినా డైరెక్టర్ సపోర్ట్ వల్ల సులభమైంది. డైరెక్టర్ గారి బలం కామెడీనే. సినిమాలో కూడా అదే ఫన్ కనిపిస్తుంది. సంయుక్తతో నాకు చాలా మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను చాలా స్వీట్ పర్సన్. చాలా విషయాల్లో నాకు సాయం చేసింది’ అని ఆమె చెప్పారు.