కొత్త అవతార్లో.. నిధి అగర్వాల్! క్రేజీ మైథాలజీ థ్రిల్లర్ షురూ
ABN, Publish Date - Aug 18 , 2026 | 12:30 PM
నిధి అగర్వాల్ హీరోయిన్గా ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో కొత్త మైథాలజీ థ్రిల్లర్ ప్రారంభమైంది. ఈ సినిమాలో నిధి సరికొత్త అవతార్లో కనిపించనున్నారు.
నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రధాన పాత్రలో ఓ ఆసక్తికరమైన మైథాలజీ థ్రిల్లర్ తెరకెక్కనుంది. వరాహ్ ఫిల్మ్స్ పతాకంపై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవంలో పి.అశోక్, పి.రేణుక కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. హుర్మత్ సర్నా క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన నిధి అగర్వాల్ అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్లో నిధి లుక్ ప్రత్యేకంగా ఉండటంతో ఆమెను ఈసారి సరికొత్త అవతార్లో చూడబోతున్నామనే ఆసక్తి నెలకొంది.
శక్తిమంతమైన కథతో, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నామని నిర్మాత సునీత్ పడోల్కర్ తెలిపారు. మైథాలజీ అంశాలకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా సినిమా ఉంటుందని చెప్పారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెలిపారు. ఇప్పటివరకు తనను చూడని ఓ కొత్త అవతార్లో ప్రేక్షకులను అలరించబోతున్నానని నిధి అగర్వాల్ చెప్పింది. దీంతో ఈ మైథాలజీ థ్రిల్లర్పై ఆసక్తి మరింత పెరిగింది.