Varanasi: ఒక్క‌ షాట్ కోసం 94 టేకులు.. జక్కన్న పర్ఫెక్షన్ కు మలయాళ స్టార్ ఫిదా!

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:46 PM

భారతీయ చిత్రసీమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే, ముందుగా వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి.

Prithviraj Sukumaran

భారతీయ చిత్రసీమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే, ముందుగా వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli)ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి (Varanasi). ఈ సినిమాపై కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. తన తాజా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆయన, ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తన పాత్రతో పాటు రాజమౌళితో పనిచేసిన అనుభవాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా, ఆ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, తాను ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎంతోమంది దర్శకులతో పనిచేశానని, వారందరిలో రాజమౌళినే అత్యుత్తమ యాక్టర్-డైరెక్టర్ అని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన విజన్, పనితీరు అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. 'వారణాసి' సినిమా విజువల్స్, దాని రేంజ్ గురించి వర్ణిస్తూ... ఈ ప్రాజెక్టును కేవలం 'భారీ' అనడం కూడా చాలా చిన్న మాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఆ పదం ఈ సినిమా అసలు స్థాయిని పూర్తిగా వివరించలేదని ఆయన చేసిన ఈ కామెంట్స్ సినిమాపై అభిమానుల్లో మరింత హైప్ పెంచుతున్నాయి.

ఇదే క్రమంలో వారణాసిలో ఒక పర్టికులర్ షాట్ కోసం తాను, మహేష్ బాబు ఏకంగా 94 టేకులు తీసుకున్నామని పృథ్వీరాజ్ చెప్పారు. నటీనటుల నుంచి తనకు వంద శాతం పర్ఫెక్ట్ అవుట్‌పుట్ రాబట్టుకోవడం కోసం జక్కన్న ఎంతగానో శ్రమిస్తారనే కథనాలు గతంలో కూడా మనం చాలానే విన్నాము. అయితే, ఒక ప్రముఖ స్టార్ హీరో స్వయంగా ఈ రేంజ్ డెడికేషన్ గురించి చెప్పడం ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి పడే తపనకు తానెంతగానో ఫిదా అయ్యానని పృథ్వీరాజ్ చెప్పడం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

రాజమౌళి సెట్స్‌లో అడుగుపెట్టిన విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఆయన సెట్ కు వచ్చేటప్పుడు, ఇది తన తొలి సినిమా అన్నంత కసితో, ఉత్సాహంతో పనిచేస్తారని వివరించారు. అంతేకాకుండా, తాను ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఇదే అత్యంత భారీ చిత్రం అని స్వయంగా రాజమౌళే తనతో చెప్పారని పృథ్వీరాజ్ వెల్లడించడం విశేషం. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్స్ తరువాత వస్తున్న సినిమా కావడంతో, 'వారణాసి' వెనుక ఉన్న ఆశయం ఏంటో మనకు అర్థమవుతోంది. మహేష్ బాబు అభిమానులతో పాటు యావత్ భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Jun 25 , 2026 | 01:45 PM