SS Rajamouli: 93 ఏళ్ల ఆస్కార్ విజేత తపన చూస్తే ముచ్చటేసింది..
ABN, Publish Date - Jun 28 , 2026 | 04:09 PM
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రాలతో ప్రపంచ సినిమా తెలుగు సినిమావైపు చూసేలా చేశారు దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. ఆర్ఆర్ఆర్తో తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ పురస్కారం తెచ్చిన ఘనత కూడా ఆయనదే.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రాలతో ప్రపంచ సినిమా తెలుగు సినిమావైపు చూసేలా చేశారు దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. ఆర్ఆర్ఆర్తో తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ పురస్కారం తెచ్చిన ఘనత కూడా ఆయనదే. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్లో జరుగుతున్న అన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో (Annecy International Animation Film Festival) పాల్గొన్నారు. అక్కడ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి చిత్రాల ప్రొజెక్షన్ జరుగుతోంది. అయితే అక్కడ ఆడిటోరియమ్లో ఓ వింత చోటు చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు, ఆస్కార్ విజేత కోస్టా గావ్రాస్ (Costa Gavras) భారతీయ సినీ అభిమానులను ఆశ్చర్యపరిచారు. దర్శకుడు రాజమౌళి సినిమాల మ్యాజిక్కు ఫిదా అయ్యారు. 93 ఏళ్ల వయసున్న ఆయన ఏకంగా 8 గంటలు థియేటర్లోనే కూర్చుని సినిమాలు చూశారు. సినిమాకు భాష, దేశం, వయసు సంబంధం లేదని నిరూపించారు.
ఈ విషయాన్ని ఎస్ఎస్ కార్తికేయ ట్వీట్ చేశారు. ‘93 ఏళ్ల ఆస్కార్ విజేత కోసా గావ్రాస్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చారు. సినిమా పూర్తయ్యాక రాజమౌళిని కలిసి ‘రేపు వచ్చి ‘ఈగ’ చూస్తా. ఈరోజు బాహుబలిని స్కిప్ చేస్తానని చెప్పారు. అయితే మరుసటి రోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన తన భార్యను తీసుకుని మళ్లీ థియేటర్కి వచ్చి 8 గంటలపాటు కూర్చుని ‘ఈగ’, ‘బాహుబలి’ రెండు చిత్రాలను పూర్తిగా వీక్షించారు. అంతేకాదు, అనంతరం నిర్వహించిన మాస్టర్ క్లాస్లో కూడా పాల్గొన్నారు. ఇప్పటికీ ఆయనలో ఉన్న తపన చూస్తే ముచ్చటేసింది. అందరిలో స్ఫూర్తినింపింది. సినిమానే మా జీవితమని, మేం సినిమాల్లో ఎందుకు ఉన్నామో మరోసారి ఈ సంఘటన గుర్తు చేసింది’ అని కార్తికేయ ట్వీట్లో పేర్కొన్నారు.