సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విశాల్‌కు.. మ‌ద్రాస్ హైకోర్ట్‌ షాక్‌! రూ.10 కోట్లు.. వెంట‌నే చెల్లించాలి

ABN, Publish Date - Feb 17 , 2026 | 09:46 PM

త‌మిళ‌ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ విశాల్ (Vishal) కు మద్రాస్‌ హైకోర్ట్ (Madras High Court,) షాక్ ఇచ్చింది.

vishal

త‌మిళ‌ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ విశాల్ (Vishal) కు మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) షాక్ ఇచ్చింది. గ‌త కొంత‌కాలంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) తో జ‌రుగుతున్న కేసులో ఆయ‌న‌కు చుక్కెదురైంది. ఆ సంస్థ‌కు డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేయ‌గా.. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం... సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. అంతేగాక వెంట‌నే విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లు చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం అందుకు విముఖత వ్యక్తం చేస్తూ విశాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో విశాల్ త‌ప్ప‌క ఆ డ‌బ్బులు చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వివ‌రాల్లోకి వెళితే.. విశాల్ మూడేళ్ళ క్రితం గోపురం పిలిమ్స్ (Gopuram Films) వ‌ద్ద రూ.21.29 కోట్లు రుణంగా తీసుకోగా ఆ మొత్తం తాము చెల్లిస్తామంటూ చెప్పి లైకా ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఇక‌పై విశాల్ న‌టించ‌బోయే చిత్రాల పంపిణీ హ‌క్కులు తమకు ఇవ్వాల‌ని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ విశాల్ ఆ ఒప్పందాన్ని మీర‌డంతో లైకా సంస్థ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా 30 శాతం వ‌డ్డీతో ఆ బ‌కాయి డ‌బ్బులు చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది. అయినా విశాల్ నుంచి ఎలాంటి డ‌బ్బు అంద‌క‌పోవ‌డంతో మ‌ర‌ల కోర్టు తీర్పు అమ‌లు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ప‌లుమార్లు కోర్టుకు వెళ్లింది. అంతేగాక ప్ర‌స్తుతం విశాల్ న‌టిస్తున్న 'మ‌కుటం' మూవీ రెమ్యున‌రేష‌న్‌ను కోర్టులో డిపాజిట్ చేసేలా తీర్పు ఇవ్వండని లైకా త‌రపు లాయ‌ర్ కోర్టును కోరారు.

కొన్నాళ్ళుగా తన క్లయింట్ పరిస్థితి ఆశించినట్టుగా లేద‌ని, తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల‌లో ఉన్నట్లు విశాల్ త‌రపు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఆపై రెండు మూడు ప‌ర్యాయాలు కూడా ఈ కేసు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే మధ్యలో న్యాయమూర్తి త‌ప్పుకోవ‌డం వంటి ఘ‌ట‌న‌లు జరిగాయి. దాంతో కేసు మ‌రో ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ అయ్యింది. చివ‌ర‌గా మంగళ వారం కోర్టు మ‌రోసారి రెస్పాండ్ అయి విశాల్ ఎట్టి ప‌రిస్థితుల్లో నిర్ణీత స‌మ‌యంలోగా డ‌బ్బులు క‌ట్టాల‌ని తీర్పునిచ్చింది.

Updated Date - Feb 18 , 2026 | 10:57 AM