విజయ్ ఆంటోని: కథా రచయితలకు ప్రాధాన్యమివ్వాలి
ABN, Publish Date - Feb 10 , 2026 | 10:05 AM
మలయాళ చిత్రపరిశ్రమ తరహాలోనే తమిళంలో కూడా కథా రచయితలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నటుడు, దర్శక నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ అభిప్రాయపడ్డారు.
మలయాళ చిత్రపరిశ్రమ తరహాలోనే తమిళంలో కూడా కథా రచయితలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నటుడు, దర్శక నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) అభిప్రాయపడ్డారు. తన మేనల్లుడు అజయ్ దిషాన్ (Ajay Dishan) హీరోగా విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై గణేశ్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బూకీ’. మంచు లక్ష్మి ఓ ముఖ్య పాత్ర పోషించగా, తనుషా హీరోయిన్గా నటించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, ‘ఈ చిత్ర దర్శకుడిని మొదట కెమెరామెన్గా నేనే పరిచయం చేశాను. ఇప్పుడు దర్శకుడిగా కూడా పరిచయం చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మలయాళ చిత్రపరిశ్రమ తరహాలో కోలీవుడ్లో కూడా కథా రచయితలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ చిత్ర కథా రచయిత పుదియ పరిధి ఈ మూవీ విడుదలైన తర్వాత మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటారన్న నమ్మకం ఉంది. హీరో అజయ్ దిషాన్ కష్టజీవి. నిజాయితీపరుడు. అన్నిటికంటే మంచి మనిషి. మంచి నటుడుగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. హీరోయిన్ చాలా ప్రతిభావంతురాలు' అని పేర్కొన్నారు.
హీరో అజయ్ మాట్లాడుతూ ‘ఇది సాధారణ చిత్రంకాదు. నా జీవితానికి లభించిన గొప్ప అనుభవం. ఈ చిత్రం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను’ అని పేర్కొన్నారు. నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ, ‘నేను బాగా పాడతాను. విజయ్ ఆంటోనీ నాకు పాటలు పాడేందుకు అనుమతి ఇవ్వాలి’ అని కోరారు. హీరోయిన్ తనుషా మాట్లాడుతూ, ‘ఇంత పెద్ద చిత్రంలో నన్ము నమ్మి నటించేందుకు అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీకి ధన్యవాదాలు. ఇంత పెద్ద చిత్రంలో అవకాశం రావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.