‘చింటూ’ వెనుక కథేంటని అడిగిన యాంకర్కు నాగవంశీ క్రేజీ ఆన్సర్!
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:23 PM
టాలీవుడ్ ప్రేక్షకులకు ‘చింటూ’ అనగానే గుర్తొచ్చే పేరు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియడానికి కారణం మాస్ మహారాజా రవితేజానే.
టాలీవుడ్ ప్రేక్షకులకు ‘చింటూ’ అనగానే గుర్తొచ్చే పేరు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi). ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియడానికి కారణం మాస్ మహారాజా రవితేజానే. ఆ మధ్య ఓ వేడుకలో నాగవంశీని చింటూ అని పిలవడంతో.. అప్పటి నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇప్పుడీ పేరు టాక్ ఆఫ్ ది కోలీవుడ్గా కూడా మారడం విశేషం. అందుకు కారణం నాగవంశీ నిర్మించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) చిత్రమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా తమిళ్లో నిర్మాణం జరుపుకుని, తెలుగులోనూ డబ్ అవుతోంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను కోయంబత్తూరులో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ స్పీచ్.. ఎప్పటిలానే మరోసారి హైలెట్ అవుతోంది. ప్రస్తుతం ఆయన స్పీచ్ వీడియోలు సోషల్ మీడియా అంతా సెన్సేషన్ అవుతున్నాయి. అందుకు కారణం ‘చింటూ’ (Chintoo) అనే పదమే కావడం గమనార్హం. ఈ వేడుకలో నాగవంశీని యాంకర్ ‘చింటూ’ కథేంటి? ఆ పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అందుకు నాగవంశీ యమా క్రేజీగా సమాధానమిచ్చారు.
‘‘నేను సోషల్ మీడియాలో చిన్నపాటి రెబల్గా ఉంటాను. అందుకే మిగిలిన హీరోల ఫ్యాన్స్ నన్ను అలా ముద్దుగా పిలుచుకుంటారు’’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగవంశీ సమాధానమిచ్చారు. ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్కు ‘అల వైకుంఠపురములో’ ఎలాంటి హిట్ అయిందో.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ సూర్యకు అంతటి సక్సెస్ఫుల్ చిత్రమవుతుంది. సంజయ్ రామస్వామిగా సూర్య తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అప్పటి నుంచి ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ సినిమాతో జీవీ హ్యాట్రిక్ ఇస్తాడని అనుకుంటున్నాము. బీజీఎమ్ సరిగా ఇవ్వకపోతే.. సూర్య ఫ్యాన్స్ చంపేస్తారని ఈ స్టేజ్ వేదికగా జీవీకి వార్నింగ్ ఇస్తున్నాను. ఇక మమిత గురించి చెప్పాలంటే... ఈ సినిమాలో రాధిక, మమిత, సూర్యల మధ్య ఫస్టాఫ్లో ఓ సీన్ ఉంటుంది. అది జెన్ జీ అందరూ ఫేస్ చేసి ఉంటారు. సినిమా చూసిన తర్వాత.. ఆ సీన్ ఎవరైతే ఫేస్ చేశారో.. నాకు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయాలని కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఆ సెంటిమెంట్ రిపీట్! రవితేజ కంబ్యాక్ ఖాయమా?
వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్లోకి వచ్చేసినట్టేనా?
తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే