శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టుకు బోనీ కపూర్, కుమార్తెలు
ABN, Publish Date - Mar 17 , 2026 | 06:50 AM
దివంగత నటి శ్రీదేవి ఆస్తి వివాదంలో ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
దివంగత నటి శ్రీదేవి (Sridevi) ఆస్తి వివాదంలో ఆమె భర్త బోనీ కపూర్ (Boney Kapoor), కుమార్తెలు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషి కపూర్ (Khushi Kapoor) మద్రాస్ హైకోర్టు (Madras High Court)ను ఆశ్రయించారు. చెంగల్పట్టులోని 4.7 ఎకరాల స్థలంపై హక్కుల కోసం కొందరు వ్యక్తులు దాఖలు చేసిన సివిల్ దావాను కొట్టివేయాలని కోరుతూ వారు జాయింట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణను హైకోర్టు మార్చి 26, 2026కి వాయిదా వేస్తూ, స్థానిక కోర్టులో చర్యలపై తాత్కాలిక స్టే విధించింది.
వివరాల్లోకి వెళితే.. 1988లో ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఓ ఆస్తిని శ్రీదేవి చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. అన్ని లీగల్ డాక్యుమెంట్లు సరిచూసి సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే ఆస్తిని స్వాధీనం చేసుకుంది. అయితే ఆ ఆస్తికి అసలు మొదలియార్ వారసులమని కొందరు వ్యక్తులు దావా వేశారు.
ఈ కేసు చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో ఉంది. అక్కడ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడక పోవడంతో, బోనీ కపూర్, జాన్వీ, ఖుషి కపూర్ మద్రాస్ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జస్టిస్ టి.వి. తమిళ్సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించి, మార్చి 26 వరకు స్టే విధించింది.