గౌతం మేనన్కు ఊరట.. హైకోర్టులో కేసు కొట్టివేత
ABN, Publish Date - Apr 08 , 2026 | 10:50 AM
ప్రముఖ దర్శకుడు, నిర్మాత గౌతం వాసుదేవ మేనన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.
ప్రముఖ దర్శకుడు, నిర్మాత గౌతం వాసుదేవ మేనన్ (Gautham Vasudev Menon)కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) లో ఊరట లభించింది. ఆయనపై ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను గౌతం మేనన్ తన సినీ నిర్మాణ కంపెనీ ఫోటాన్ కథాస్ (Photon Kathaas) కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయలేదంటూ ఆదాయపన్ను శాఖ ఎగ్మోర్ కోర్టులో కేసు వేసింది.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ గౌతం మేనన్ మద్రాస్ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఫోటాన్ కథాస్ కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి తాను 2011లోనే వైదొలిగానని, ఈ విషయాన్ని న్యాయ స్థానానికి కంపెనీ తెలియజేయలేదని, పైగా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఈ కేసులో వాదనలు ఆలకించిన హైకోర్టు.. నిర్ణీత ఆర్థిక సంవత్సరం ముగియకముందే డైరెక్టర్ పదవి నుంచి గౌతం మేనన్ తప్పుకున్నారని, అందువల్ల ఈ కేసుకు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఐటీ శాఖ నమోదు చేసిన కేసును కొట్టివేసింది.