నిరోషా: ‘తాయ్ కిళవి’ చూసి నిరోషా భావోద్వేగం
ABN, Publish Date - Feb 27 , 2026 | 04:21 PM
సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో నిర్మించిన ‘తాయ్ కిళవి’ సినిమా చూసి అలనాటి హీరోయిన్, రాధిక సోదరి నిరోషా కన్నీరు మున్నీరయ్యారు.
సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ‘తాయ్ కిళవి’ సినిమా చూసి అలనాటి హీరోయిన్, రాధిక సోదరి నిరోషా కన్నీరు మున్నీరయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. కాగా ఫిల్మ్ సెలెబ్రిటీస్, మీడియాకు ఒక రోజు ముందు ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరోషా తన అక్క రాధికను గట్టిగా హత్తుకుని భోరున విలపించారు.
అనంతరం నిరోషా మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో మా అక్క పోషించిన పాత్ర చూసిన తర్వాత నాకు నోట మాట రాలేదు. అక్కను హత్తుకుని అభినందించాను. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. దీనికి కారణం మా అమ్మ గుర్తుకు వచ్చారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాల్లో అక్క పాత్రలో మా అమ్మను చూశాను. పలు సందర్భాల్లో మహిళలు ధైర్యంగా, ఆత్మగౌరవంతో ఉండాలని, ఎవరిపైనా ఆధారపడరాదని, మన కోసం కొంత సంపాదన చేర్చిపెట్టుకోవాలని, కొంత సమయాన్ని కేటాయించుకోవాలని, మా అమ్మ చెబుతుండేది. ఈ సినిమాలో అలాంటి సందేశమే ఉంది. అందుకే కాస్త ఎమోషనల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత థియేటర్లో ఒక మంచి చిత్రం చూడటంతో పాటు కడుపుబ్బ నవ్వాను’ అని నిరోషా పేర్కొన్నారు. హీరో శివ కార్తికేయన్ తన సొంత నిర్మాణ సంస్థ శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.