Drishyam 3: రీమేక్ లేదు.. అనువాదమే! నిరాశలో వెంకీ ఫ్యాన్స్
ABN, Publish Date - May 13 , 2026 | 06:56 AM
దక్షిణ భారతదేశంలో చాలా పాపులర్ అయిన సీక్వెల్స్లో ‘దృశ్యం’ ఒకటి. మొదటి రెండు భాగాలు మలయాళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకాదరణ పొందాయి.
దక్షిణ భారతదేశంలో చాలా పాపులర్ అయిన సీక్వెల్స్లో ‘దృశ్యం’ (Drishyam) ఒకటి. ఫ్యామిలీ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా మొదట మోహన్ లాల్ (Mohanlal)తో మలయాళంలో తయారైనా ఆ తర్వాత వెంకటేశ్ (Venkatesh) హీరోగా తెలుగులోనూ వచ్చి ప్రేక్షకుల్ని అలరించింది. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాంబాబుగా వెంకీ నటన అందరినీ ఆకట్టుకుంది.
‘దృశ్యం’ మొదటి రెండు భాగాలు మలయాళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మోహన్లాల్ ప్రధాన పాత్ర పోషించిన ‘దృశ్యం 3’ (Drishyam 3) మలయాళ వెర్షన్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాలి. అయితే గల్ఫ్ దేశాల్లో యుద్ధమేఘాలు ఆవరించడం, మలయాళ చిత్రాలకు గల్ఫ్ మంచి మార్కెట్ కావడంతో ఆ పరిస్థితుల్లో విడుదల వాయిదా వేసి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందని, మళ్లీ వెంకటేశ్ నటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మలయాళ వెర్షన్ ట్రైలర్తో పాటు తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేయడంతో ప్రేక్షకులకు తెలుగులో ఇది రీమేక్ కావడంలేదని అర్థమైంది. మలయాళ సినిమాతో పాటు ఈ నెల 21నే విడుదలయ్యే తెలుగు డబ్బింగ్ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.