ఇళయరాజాకు.. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Jul 02 , 2026 | 07:54 AM
తన చిత్రాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీ రైట్ వివాదంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు చుక్కెదురైంది.
తన చిత్రాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీ రైట్ వివాదంలో సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja)కు చుక్కెదురైంది. ఈ వ్యవహారంపై గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలన్న ఇళయరాజా అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) తిరస్కరించింది. 1976 నుంచి 2001 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించిన పాటలను ఆయా చిత్ర నిర్మాతలు శాశ్వత కాపీరైట్ హక్కులను సారేగామా ఇండియా లిమిటెడ్ (Saregama) సంస్థకు అప్పగించారు.
సినిమాల కోసం రూపొందించిన పాటల కాపీ రైట్ అందించే భారత కాపీరైట్ చట్టం 1957 ప్రకారం, ఒక సినిమా కోసం సృష్టించిన పాటల మొదటి యజమాని సాధారణంగా ఆ సినిమా నిర్మాత అవుతారని ఉంది. అనంతరం ఓ కేసుకు సంబంధించి 1977లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో.. నిర్మాతలతో ప్రత్యేకంగా ఒప్పందాలు లేని పక్షంలో సంగీత దర్శకులు పాటలకు తామే హక్కుదారులుమంటూ ప్రకటించే హక్కు లేదని స్పష్టం చేసింది.
ఆ మేరకు, ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. మధ్యంతర స్టే తొలగించేందుకు నిరాకరించింది. 134 చిత్రాలకు సంబంధించిన పాటల కాపీ రైట్ హక్కులను ఇళయరాజా కొన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంపై గతంలో కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ స్టేను తొలగించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నిరాకరించింది.