వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో 'ఎం4ఎం'
ABN, Publish Date - Apr 06 , 2026 | 04:49 PM
జో శర్మ కీలకపాత్ర పోషించిన 'ఎం4ఎం' మూవీ మే 8న ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో మోహన్ వడ్లపట్ల నిర్మించారు.
మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'ఎం4ఎం'. ఉత్కంఠ భరితమైన హత్యా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య కీలక పాత్రలను పోషించారు. ఈ థ్రిల్లర్ మూవీని ఐదు భాషల్లో మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మోహన్ వడ్లపట్ల తెలిపారు. 'ఎం4ఎం' మూవీని యు.ఎస్.ఎ.కు చెందిన మ్యాక్ విన్ గ్రూప్తో కలిసి మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.
భారతదేశంలో 'ఎం4ఎం' సినిమాను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోంది. ఉత్తర భారతంలో జెవిఇఎల్ ఎంటర్ టైన్ మెంట్స్, అమెరికాలో టెక్ ఫ్లిక్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు రిలీజ్ చేయబోతున్నాయి.
'ఎం4ఎం సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుందని, కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ సందర్భంగా అక్కడ ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించామని, అలానే ముంబైలోనూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశామ'ని మోహన్ వడ్లపట్ల తెలిపారు. ఈ సినిమా నిమిత్తం తాను భారత్, అమెరికాలో విస్తృతంగా పర్యటించానని హీరోయిన్ జో శర్మ చెప్పారు.