Draupadi 2: ఆ.. హీరోయిన్ చేయనంది! హీరో.. పారితోషికం తీసుకోలేదు
ABN, Publish Date - Jan 14 , 2026 | 09:44 AM
ద్రౌపది–2 సినిమాలో హీరో రిచర్డ్ రిషి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని దర్శకుడు మోహన్ జి వెల్లడించారు.
‘ద్రౌపది-2’ (Draupathi 2) మూవీ కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటించిన హీరో రిచర్డ్ రిషి (Richard Rishi) అని ఆ చిత్ర దర్శకుడు మోహన్.జి (Mohan G) తెలిపారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్కు విడదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో రక్షణ ఇందుసుధన్, నట్టి నటరాజ్, వైజీ మహేంద్రన్, శరవణ సుబ్బయ్య, దివి కీలక పాత్రల్లో నటించారు. చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి నగరంలో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ మాట్లాడుతూ, ‘ఈ స్టోరీని అనేక మంది నిర్మాతలకు వివరిస్తూ, హీరోను మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. పైగా ఈ సినిమా కోసం రిచర్డ్ రిషి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ఈ చిత్రం తొలి భాగంలో నటించిన హీరోయిన్ రెండో భాగంలో నటించేందుకు ఇష్టపడలేదు. అందుకే ఆమె స్థానంలో రక్షణను హీరోయిన్గా ఎంపిక చేసి, స్టోరీ మొత్తం వివరించగా, ఆమె నటించేందుకు అంగీకరించారు.
గతంలో కాశీకి వెళ్ళినపుడు ఓ ఆలయంలో నందీశ్వరుడున్నారు. కానీ శివలింగం లేదు. ఙ్ఞానవాపి మసీదు ఉంది. అన్యదేశస్థులు ఉత్తదారిదిపైనే కాకుండా దక్షిణ భారతదేశంపై కూడా దండయాత్ర చేసి అపారనష్టం చేకూర్చారని తెలుసుకున్నాను. ఇక్కడే ఈ చిత్రానికి బీజం పడింది. మన దేశంలో ఒకే దేవుడిని పూజించలేం. అన్ని దేవుళ్ళను సమానంగా పూజించాలి. ‘ఒకటే కులం.. ఒకటే దైవం కాదు’ అనే డైలాగ్ ఉంది. దీని వల్ల ఎలాంటి వివాదం ఉత్పన్నంకాదని భావిస్తున్నాను. చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎలాంటి చిత్రమైనా తీస్తాను’ అని పేర్కొన్నారు. హీరో రిచర్డ్ రిషి మాట్లాడుతూ ‘గత నా చిత్రాలను ఆదరించినట్టుగానే ఈ చిత్రానికి కూడా మీడియా సపోర్టు చేయాలని’ అని కోరారు.