Dhanush: వారి ప్రోత్సాహంతోనే ఈ జర్నీ సాధ్యమైంది..
ABN , Publish Date - Jul 19 , 2026 | 07:21 PM
'మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ విజయాన్ని కూడా అదే నమ్మకంతో స్వీకరిస్తున్నాను' అంటూ కోలీవుడ్ స్టార్ ధనుష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
'మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ విజయాన్ని కూడా అదే నమ్మకంతో స్వీకరిస్తున్నాను' అంటూ కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush) ఆనందాన్ని వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు(72nd National Film Awards) మరపురాని విజయాన్ని అందించాయి. ఈసారి జాతీయ స్థాయిలో ఆయనకు రెండు గౌరవాలు దక్కాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’(Raayan) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కాగా ‘కెప్టెన్ మిల్లర్’(Captain Miller) చిత్రంలోని నటనకు ధనుష్ స్పెషల్ మెన్షన్ అవార్డును అందుకోనున్నారు. దర్శకుడిగా తొలిసారి జాతీయ అవార్డును అందుకోవడం, నటుడిగా నాలుగోసారి జ్యూరీ గుర్తింపు పొందడం పట్ల ధనుష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 'ఓం నమశ్శివాయ..! ‘రాయన్’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడం, ‘కెప్టెన్ మిల్లర్’తో స్పెషల్ మెన్షన్ దక్కడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ గౌరవం అందించిన జ్యూరీ సభ్యులకు, ఎంపిక కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
'కెరీర్ ప్రారంభం నుంచి నాకు అండగా నిలిచిన మీడియాకు, నా ఎదుగుదలకు కారణమైన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నటుడిగా ఇది నా నాలుగో జాతీయ పురస్కారం కాగా.. దర్శకుడిగా ఇది నా తొలి జాతీయ అవార్డు. నా అభిమానుల ప్రేమ, ప్రోత్సాహం లేకుండా ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. ‘కెప్టెన్ మిల్లర్’ గురించి చెబుతూ 'ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో అత్యుత్తమమైనది ఇదేనని మొదటి నుంచీ నమ్ముతున్నాను. నా మనసుకు ఎంతో దగ్గరైన ఆ పాత్రకు ఈ గుర్తింపు రావడం ఎంతో ప్రత్యేకం. ‘రాయన్’తో దర్శకుడిగా లభించిన తొలి జాతీయ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Pawan Kalyan: తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. విజేతలకు పవన్ శుభాకాంక్షలు
72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..
విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..