ఇటు బ్యాండ్ మేళం... అటు హైకూ! శ్రీదేవి బిజీ!!
ABN, Publish Date - Feb 24 , 2026 | 01:10 PM
'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి నటించిన 'బ్యాండ్ మేళం' సినిమా మార్చి 13న విడుదల కాబోతోంది. ఆమె నటిస్తున్న మరో సినిమా 'హైకూ' రెండో షెడ్యూల్ త్వరలో చెన్నయ్ లో మొదలు కానుంది.
'కోర్టు' (Court) సినిమాతో హీరోయిన్గా పరిచయమై, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది శ్రీదేవి (Sridevi). ఆ తర్వాత వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే వాటిలో కూడా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంది. ఆమె తాజా చిత్రం 'బ్యాండ్ మేళం' (Bandmelam) మార్చి 13న విడుదల కాబోతోంది. దీనితో పాటే 'హైకూ' (Haiku) సినిమాలోనూ శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను డాక్టర్ డి. అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. 'హైకూ' సినిమాలో శ్రీదేవితో పాటు ఏగన్, అడ్రిచి అరుణ్, కలైవాణి భాస్కర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మూవీకి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. జో ఫేమ్ హరిహరణ్ రామ్ అడిషనల్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ సక్సెస్ ఫుల్గా పూర్తయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.
'హైకూ' ఫస్ట్ షెడ్యూల్లో ఏగన్, శ్రీదేవి, అడ్రిచి అరుణ్, కలైవాణి బాస్కర్ మీద కీలక సన్నివేశాల్ని చిత్రీకరించామని, షెడ్యూల్ సజావుగా, సమయానికి ముగిసిందని టీం తెలిపింది. నటీనటుల కమిట్మెంట్ను చూస్తుంటే.. ఈ మూవీ జర్నీపై మరింత నమ్మకం ఏర్పడిందని, ఎంతో ఆశాజనంగా అనిపిస్తోందని మేకర్స్ చెప్పారు. మొదటి షెడ్యూల్లోని ఫుటేజ్తో సంతృప్తికరంగా ఉన్నామని దర్శక నిర్మాతలు అన్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ ప్రియేష్ గురుస్వామి అందించిన మ్యాజికల్ విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు. రెండో షెడ్యూల్ను త్వరలో చెన్నైలో ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. చెన్నైలోని పరిసర ప్రాంతాల్లో కథలోని కీలకమైన భాగాలను చిత్రీకరిస్తామని అన్నారు. ‘హైకూ’ సెప్టెంబర్ 2026లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది.