Swetha menon: కీలుబొమ్మను కావాలనుకోవడం లేదు..
ABN, Publish Date - Jun 22 , 2026 | 10:12 AM
మలయాళ నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్' (అమ్మ) వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది.
మలయాళ నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్' (Amma - అమ్మ) వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. చర్చల అనంతరం అమ్మ అధ్యక్షురాలు శ్వేత మేనన్ (swetha Menon), ఆమె నేతృత్వంలోని 17 మంది కార్యవర్గ సభ్యులు రాజీనామా చేశారు. గత ఏడాది ఆమె అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించారు. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్’ చరిత్రలోనే మొదటిసారి నటి శ్వేతామేనన్ అధ్యక్షురాలిగా, కుకూ పరమేశ్వరన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మహిళలుగా ప్రత్యేకత చాటారు. ఆదివారం కొన్ని గంటలపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. కమిటీలో అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయని, ప్రధాన కార్యదర్శి కుకూ పరమేశ్వరన్ ఇచ్చిన వార్షిక నివేదికలోని ఆదాయ- వ్యయాల్లో స్పష్టత లేదని ఓ వర్గం స్ఘభ్యులు ఆరోపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగిందని మాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ సమస్య ఇంకా పెద్దది కావడంతో శ్వేతామీనన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాగే సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా ఇచ్చారు.
అనంతరం శ్వేతా మీనన్ మీడియాతో మాట్లాడుతూ ‘సెప్టెంబరు మొదటి నుంచి మా ఆర్థిక లావాదేవీలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ అంతకుముందు కమిటీకి సంబంధించి చాలా సమస్యలున్నాయి. గతంలో ఆరోపణలున్న వ్యక్తుల చేతుల్లోకే మళ్లీ సంఘం బాధ్యతలు వెళ్తున్నాయి. ఎలాంటి సమాచారం లేకుండానే మమ్మల్ని తొలగించే ఎజెండా నడిచింది. నాకు వ్యక్తిత్వం ఉంది. నిర్భయంగా మాట్లాడతాను. మేము ఎవరి చేతిలోనైనా కీలుబొమ్మలుగా ఉండి ఉంటే ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేవాళ్లం కాదు. నేను కీలుబొమ్మగా మారడానికి సిద్థంగా లేను. సంఘంతో సంబంధం తెంచుకోవడం ఉపశమనంగా అనిపించింది’ అన్నారు.
నూతన కమిటీ ఏర్పడే వరకూ సంస్థను నడపడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది.