Tollywood: 'పద్మశ్రీ' పూర్వజన్మ సుకృతం: రాజేంద్ర ప్రసాద్
ABN, Publish Date - Jan 26 , 2026 | 02:46 PM
పద్మశ్రీ పురస్కార ప్రకటన పట్ల నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ నటుడు రాజేంద ప్రసాద్ (Rajendra Prasad) తనకు పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది పూర్వజన్మ సుకృతంగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆయన ఈ విషయమై తన స్పందన తెలియచేస్తూ, 'మీడియా మిత్రులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నాకు 'పద్మశ్రీ' (Padmasri) పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేను. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా కళలను గౌరవించి, నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు నేను ఈ స్థాయిలో నిలబడటానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈ రోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. నాలాంటి ఒక నటుడిని, మీ ఇంటి మనిషిలా ఆదరించి, 'నటకిరీటి'ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నన్ను ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను' అని అన్నారు.