Meera Chopra: తప్పు ప్రతిసారీ మగాడిదే కానక్కర్లేదు!

ABN , Publish Date - May 19 , 2026 | 12:08 PM

నటి, నిర్మాత మీరా చోప్రా జయం రవికి బాసటగా నిలిచింది. ప్రతిసారీ మగవాళ్ళదే తప్పు అనుకోనక్కర్లేదని, వారి వాదన కూడా వినాలని కోరింది. జయం రవి మంచి మనిషి, సున్నిత మనస్కుడని మీరా చోప్రా పేర్కొంది.

Jayam Ravi - Meera Chopra

తమిళ సినిమా రంగంలో ఇప్పుడు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జయం రవి (Jayam Ravi) కి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా కోలీవుడ్ చీలిపోతోంది. విడాకులు మంజూరు అయ్యేవరకూ తాను సినిమాలలో నటించనని, తన చిత్రాలను విడుదల చేయనని జయం రవి ఇటీవల ప్రకటించాడు. పెళ్ళి అయిన దగ్గర నుంచి నరకం అనుభవించానని చెబుతూ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ వెంటనే గాయని కెనీషా నాటకీయంగా జయం రవితో తన అనుబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశానని ప్రకటించింది. ఇదే సమయంలో 'నిద్రపోతున్న సింహాన్ని లేపవద్దం'టూ జయం రవి భార్య ఆర్తి హెచ్చరించింది. ఆమెకు బాసటగా సీనియర్‌ నటి ఖుష్బూ (Khushboo) నిలిచింది. దీంతో గతంలో ఓ వేడుకపై 'తంబీ...' అంటూ ఖుష్బూ జయం రవిని సంభోదించి, ఆర్తిపై అతనికి ఉన్న ప్రేమను వివరించిన అవార్డ్ సెర్మనీ వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్‌ చేయడం మొదలు పెట్టారు.


ఇదిలా ఉంటే... ఒకప్పటి కథానాయిక మీరా చోప్రా (Meera Chopra) ఇప్పుడు రంగంలోకి దిగింది. జయం రవికి బాసటగా నిలుస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. 'జయం రవి' తనకు బాగా తెలుసని చెప్పింది. సౌతిండియన్ మూవీస్‌లో నటించే సమయంలో అతనితో పరిచయం ఉందని తెలిపింది. ఇటీవల జయం రవి విడాకులకు సంబంధించిన వార్త తన దృష్టికి వచ్చిందని చెబుతూ, 'ప్రతిసారి తప్పు మగవాడిదే అని చెప్పలేం. మహిళల పక్షాన ఉన్న చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు కూడా నేను చూశాను. పురుషుడి వాదన కూడా వినాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి జయం రవి చాలా మంచి మనిషి. ఆయన విషయంలో నిజం గెలుస్తుందని, న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాను' అని తెలిపింది. మొత్తానికి జయం రవి కన్నీటికి మీరా చోప్రా కరిగిపోయిందని అర్థమౌతోంది.


దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎస్.జె. సూర్య డైరెక్ట్ చేసిన 'అన్బే ఆరుయిరే' చిత్రంతో మీరా చోప్రా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. అప్పట్లో ఓ సినిమా దర్శక నిర్మాతలపై ధ్వజమెత్తిన సందర్భంలో మీరా చోప్రా పేరు మీడియాలో బాగా నానింది. ఆపైన ఆమె నిదానంగా హిందీ సినిమాలవైపు దృష్టి సారించి, దక్షిణాది చిత్రాలకు దూరమైంది. ఇటీవల విడుదలైన సైలెంట్‌ మూవీ 'గాంధీ టాక్స్'కు నిర్మాణ భాగస్వామిగా మీరా చోప్రా వ్యవహరించింది.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఈ లుక్ కోసమే ఇంతకాలంగా...

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Updated Date - May 19 , 2026 | 12:24 PM