నటులు పొలిటికల్ పంచింగ్ బ్యాగ్స్ కాదు
ABN, Publish Date - Mar 18 , 2026 | 09:33 AM
తమిళనాడు ఎంపీ సి.వి. షణ్ముగం చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు సైతం పరోక్షంగా స్పందించారు. సినిమా వారిని రాజకీయ ప్రయోజనాల కోసం టార్గెట్ చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
తమిళనాడు ఎంపీ సి.వి. షణ్ముగం... నయనతార (Nayantara) పై చేసిన వ్యాఖ్యలపై చిచ్చు రగులుతోంది. ఇప్పటికే నడిగర్ సంఘం నాయకులు దీనిని తీవ్రంగా ఖండించారు. షణ్ముగం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఈ విషయమై స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు. 'రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సినిమా వారిని చర్చల్లోకి లాగడం దారుణమని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. తమిళనాడులోనే కాదు ఎక్కడ కూడా ఇలాంటివి జరగకూడదని ఆయన కోరుకున్నారు.
నటీనటులు పొలిటికల్ పంచింగ్ బ్యాగ్స్ కాదని, సినిమాలతో సంబంధం లేకుండా వారికి కూడా వ్యక్తిగత జీవితం, కుటుంబం అనేవి ఉంటాయని మంచు విష్ణు అన్నారు. రాజకీయ చర్చలలో ముఖ్యంగా మహిళల విషయంలో ప్రాథమిక గౌరవానికి నష్టం కలిగించకూడదని ఆయన తెలిపారు. భారతీయ సంస్కృతిలో మహిళలను శక్తి స్వరూపణిగా భావిస్తారని, అలాంటి వారిని అవమానించడం, హెడ్ లైన్స్ వార్తలోకి లాగడం సరికాదని మంచు విష్ణు హితవు పలికారు. అధికార పార్టీని విమర్శించే క్రమంలో నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షణ్ముగం ఇప్పటికైనా క్షమాపణలు చెబుతారేమో చూడాలి.