సాయిబాబాపై విద్వేషపూరిత వీడియోలు.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:36 AM
షిర్డీ సాయిబాబాపై అభ్యంతరకరంగా, విద్వేషం కలిగించేలా ఉన్న వీడియోలు, పోస్టుల తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
షిర్డీ సాయిబాబా (Shirdi Sai Baba)పై ప్రజల్లో విద్వేషం కలిగించే విధంగా.. ఆ ఆధ్యాత్మిక గురువును అవమానించేవిధంగా యూట్యూబ్ (YouTube), ఇతర ఆన్లైన్ ప్లాట్ఫాంలపై చక్కర్లు కొడుతున్న వీడియోలు, అభ్యంతరకరమైన కంటెంటన్ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది.
షిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు, పోస్టులు పెట్టారని, వాటిని తొలగించాలంటూ హైకోర్టులో షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్టు పిటిషన్ వేసింది. ఆ వీడియోలు, పోస్టుల్లో సాయిబాబా అసలు పేరు 'చాంద్ మియా' అంటూ ఆయన్ను జిహాదీ, బ్రిటిషర్ల గూఢచారి, హంతకుడు, రేపిస్టు, దోపిడీదారు, మతమార్పిడులు చేసే వ్యక్తి అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటూ ట్రస్టు తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది.
ఇదంతా సమాజంలో ఆశాంతిని, మతపరమైన ద్వేషాన్ని రాజేసేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం అని పిటీషన్ ట్రస్ట్ పేర్కొంది. తాము ఇప్పటికే విషయాన్ని యూట్యూబ్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా షిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న వీడియోలపై వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ట్రస్టు ఆరోపించింది. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ విచారించారు. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు.