అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్.. ఒక్క తెరపై మార్వెల్ హీరోల మహా సంగ్రామం!
ABN, Publish Date - Jul 21 , 2026 | 02:24 PM
థోర్, కెప్టెన్ అమెరికా, ఫాంటాస్టిక్ ఫోర్, ఎక్స్-మెన్ పాత్రలతో తెరకెక్కిన మార్వెల్ స్టూడియోస్ 'అవెంజర్స్: డూమ్స్డే' ట్రైలర్ విడుదల అయింది.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్ డే (Avengers Doomsday) మూవీ నుంచి ఎట్టకేలకు ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ స్థాయి పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని మరింతగా రెట్టింపు చేస్తోంది. ట్రైలర్లో మార్వెల్కు చెందిన పలువురు ప్రముఖ సూపర్ హీరోలు ఒకే కథలో కనిపించనున్నట్లు చూపించారు. థోర్, కెప్టెన్ అమెరికా, ఫాంటాస్టిక్ ఫోర్ సభ్యులు, బ్లాక్ పాంథర్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. వీరంతా తమను మించిన బలవంతుడైన ప్రత్యర్థిని ఢీ కొనాల్సి ఉందంటూ హింట్స్ ఇస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచేదిగా ఉంది.
అంతేకాదు, ఎక్స్-మెన్ విశ్వానికి చెందిన ప్రముఖ పాత్రలు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నాయి. ప్రొఫెసర్ ఎక్స్గా పాట్రిక్ స్టీవర్ట్, మ్యాగ్నెటోగా ఇయాన్ మెక్కెలెన్, సైక్లోప్స్గా జేమ్స్ మార్స్డెన్ మళ్లీ తెరపై కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం చేసింది. దీంతో పాటు మార్వెల్, ఎక్స్-మెన్ ప్రపంచాలు ఒకే సినిమాలో కలవడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
ఇదిలాఉంటే ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. భారత ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే.. ఇప్పటికే ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అదే నెలలో మరో ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం డ్యూన్ పార్ట్-2, ప్రభాస్ ఫౌజీ వంటి భారీ చిత్రాలు కూడా వస్తుండడంతో ఈ చిత్రాల నడుమ పోటీ మాములుగా ఉండదు అంటూ అభిమానులు సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.